వైఎస్సార్ విగ్రహం ధ్వంసం ఘటన గుంటూరు జిల్లాలో హాట్టాపిక్గా మారింది. నిన్న వైఎస్సార్ విగ్రహం ధ్వంసం ఘటనలో పోలీసులు ఇద్దరు టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. దీంతో వారి అరెస్ట్ను నిరసిస్తూ టీడీపీ నేత అరవింద్ బాబు ధర్నా చేపట్టారు. పోలీసులు అరవింద్ బాబు ధర్నా చేపట్టిన స్థలానికి చేరుకొని ధర్నా ఆపే ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో అరవింద్కు గాయాలయ్యాయి. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అరవింద్ పరిస్థితి ఆరోగ్య పరిస్థితి నిలకరగానే ఉందని ఆయన కుటుంబీకులు వెల్లడించారు.
తాజాగా నరసరావుపేటలో టీడీపీ నాయకులు మరోసారి నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నిరసనలో మాజీ మంత్రులు జవహర్, కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, యరపతినేని, తెనాలి శ్రావణ కుమార్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అక్రమంగా అరెస్టు చేసిన టీడీపీ కార్యకర్తలను విడుదల చేయాలని నినాదాలు చేశారు. అంతేకాకుండా అరవింద్ బాబుపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నల్ల జెండాలతో టీడీపీ శ్రేణులు నిరసన ర్యాలీలో పాల్గొన్నారు.