Pawan Kalyan: చిత్తూరు జిల్లా పెనుమూరు తహసీల్దార్ కార్యాలయంలో రైతు రత్నం నాయుడు మృతి ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. వైసీపీ ప్రభుత్వం అలసత్వానికి రైతు బలైపోవడం దురదృష్టకరమని విమర్శించారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు సకాలంలో స్పందించి ఉంటే రైతు ప్రాణం నిలబడి ఉండేదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. అక్రమ కేసులు పెట్టే వైసీపీ ప్రభుత్వానికి ఇలాంటివి పట్టించుకునే సమయమే లేదని విమర్శించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం దీక్ష చేపట్టిన ఒక సామాన్య రైతు ప్రాణాలు కోల్పోవడం మానవీయతకు మాయని మచ్చగా మిగిలిపోతుందని పవన్ అన్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. ఆటవిక అరాచక పాలనలో ఉన్నామా అని ప్రశ్నించారు.
Read Also: Arvind kejriwal: భగవద్గీత శ్లోకాన్ని తప్పుగా చదివిన కేజ్రీవాల్.. వీడియో వైరల్
న్యాయస్థానం ఉత్తర్వులను అధికారులు పాటించినట్లయితే ఒక బడుగు రైతు ప్రాణాలు పోయి ఉండేవి కాదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. దీక్ష చేపట్టిన రైతు రత్నంపై కొందరు రెవిన్యూ ఉద్యోగులు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో ఆందోళనకు గురై అకస్మాత్తుగా మృతి చెందడం బాధాకరమన్నారు. పార్టీ జెండా ఎగురవేయడానికి ప్రయత్నిస్తే అక్రమ కేసులు పెట్టే వైసీపీ ప్రభుత్వానికి ఇటువంటి సంఘటనలను పట్టించుకునే సమయమే లేదని పవన్ ఎద్దేవా చేశారు. దీక్ష చేస్తున్న రైతు మరణం అత్యంత దారుణమని.. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించకపోతే ప్రజాస్వామ్య పరమార్ధం కలుషితమవుతుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ అసమర్ధతతోనే దీక్షలోని రైతు మృతి – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/Adf4CB7xAh
— JanaSena Party (@JanaSenaParty) September 3, 2022