పర్యాటక ప్రియుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేకంగా తీర్థయాత్ర రైళ్లను నడుపుతోంది. ఈ నేపథ్యంలో భారత్ దర్శన్ కార్యక్రమంలో భాగంగా మార్చిలో ఉత్తర భారత యాత్రను నిర్వహిస్తోంది. రాజమండ్రి నుంచి ఈ రైలు బయలుదేరుతుందని ఐఆర్సీటీసీ డీజీఎం కిషోర్ సత్య, ఏరియా మేనేజర్ కృష్ణ వెల్లడించారు. మార్చి 19న రాజమండ్రి నుంచి ఈ రైలు బయలుదేరి సామర్లకోట, తుని, విశాఖ మీదుగా ఉత్తర భారతమంతా ప్రయాణిస్తుందని తెలిపారు.
ఉత్తర భారత యాత్ర ప్యాకేజీ 9 రోజులు, 9 రాత్రులు ఉంటుందని ఐఆర్సీటీసీ అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా ఆగ్రా, మధుర, వైష్ణోదేవి, అమృత్సర్, హరిద్వార్ వంటి సందర్శనీయ ప్రదేశాలు, ప్రముఖ ఆలయాలను చూపిస్తామని పేర్కొన్నారు. ఈ రైలులో 12 స్లీపర్ క్లాస్, ఒక ఏసీ త్రీ టైర్ బోగీతోపాటు ప్యాంట్రీ కార్ ఉంటుందన్నారు. స్లీపర్ క్లాస్లో వెళ్లాలనుకునే వారు రూ.8,510, ఏసీ త్రీ టైర్ కోసం రూ.10,400 చెల్లించాలన్నారు. ఈ ప్యాకేజీలో భాగంగా యాత్రికులకు ఉదయం టీ, కాఫీతోపాటు అల్పాహారం, భోజన సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ఈ ప్యాకేజీ కోసం పర్యాటకులు ఐఆర్సీటీసీ వెబ్సైట్ను సందర్శించవచ్చని సూచించారు.