ఈజీమనీ కోసం తాపత్రయపడుతూ.. తమ కష్టాన్ని మరిచిపోతున్నారు చాలామంది ప్రబుద్ధులు. ఎవరో స్వామీజీ చెప్పారనో.. అక్కడ తవ్వితే భారీ నిధులు స్వంతం అవుతాయని నకిలీ బాబాల మాటలు నమ్మి తవ్వేస్తున్నారు. గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా గుప్త నిధుల కోసం తవ్వకాలు సంచలనంగా మారాయి…గతంలో కృష్ణ జిల్లా కొండపల్లిలో తవ్వకాలు జరిగితే ఇప్పుడు తాజాగా ఏలూరు జిల్లా నూజివీడులో ఈ తవ్వకాలు కలకలం సృష్టిస్తున్నాయి….నూజివీడుకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి గుప్త నిధుల కోసం ఏకంగా అతని ఇంట్లోనే 15 అడుగుల లోతు గొయ్యి తవ్వటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
గొల్లపల్లి గ్రామానికి చెందిన వేదాంతం శ్రీనివాసరావు భార్య పిల్లలతో ఎన్నో ఏళ్ల క్రితం వైజాగ్ లో సెటిల్ అయ్యాడు. బాగా చదువుకున్న ఇతగాడు అక్కడే ఓ ప్రైవేట్ కాలేజీ లో లెక్చరర్ గా కూడా పని చేస్తున్నాడు. ఇతనికి అతని సొంతూరైన నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో 100 ఏళ్ళ కాలం నాటి ఓ పురాతన ఇల్లు ఉంది…ఎంతో కాలంగా అక్కడ ఎవ్వరు వుండకపోవటంతో పూర్తిగా పాత బడిన ఆ ఇంటిని చూడటానికి అప్పుడప్పుడు శ్రీనివాసరావు వస్తుండే వాడు…. అలా అతను వచ్చిన ప్రతిసారి ఆ ఇంటి మధ్యలో గజ్జలు చప్పుడు, భూమి నుండి ఏవో విచిత్ర శబ్దాలు వస్తున్నట్లు భావించిన శ్రీను అనుమానంతో బెంగుళూరుకు చెందిన మునిసింగ్ ప్రేమ్ నాధ్ అనే స్వామిజీని పిలిపించి చూపించాడు.
Read Also: Marri Sasidhar Reddy: రాజకీయమా.. రిటైర్మెంటా?
శ్రీను ఇంటికి వచ్చిన ఆ బెంగుళూరు స్వామి ఇంటి మొత్తాన్ని పరిశీలించి ఇక్కడ ఏదో నిధి ఉన్నట్లు అనుమానంగా ఉందని చెప్పాడు. అంతే,…అప్పటి నుండి తన ఇంట్లో ఏదో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు భావించిన శ్రీనివాసరావు తనతో తవ్వకాలకు సహకరించాలని చాలామంది స్నేహితులను కోరాడు. అలా గుప్తనిధుల కోసం గత వారం రోజులుగా ఇంట్లో తవ్వకాలు చేస్తున్నాడు….ఈ గుప్త నిధుల వేట సాగించేందుకు తనతోపాటు మరో ముగ్గురు వ్యక్తులను ఎంచుకున్నాడు.
గుప్తనిధుల విషయాలు తెలిసిన బెంగుళూరు పూజారిని , ఓ లాయర్ని ,ఇంకో వ్యక్తిని ఎంచుకున్నాడు…. గత కొద్ది రోజులుగా తన ఇంటిలో వస్తున్న శబ్దాలు వ్యవహారం వీళ్ళతో చెప్పి వాటిని బయటకు తీసేందుకు అందరూ కలిసి ముహూర్తం ఖరారు చేశారు… గత వారం రోజులుగా గొల్లపల్లి గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా పూజలు నిర్వహించి తవ్వకాలు ప్రారంభించారు..అలా ఇంటి మధ్యలో దాదాపు 15 అడుగుల పెద్ద గొయ్య తీసారు. వీరు తవ్వుతున్న సమయంలో శబ్దాలు రావటం పాడు బడ్డ ఇంటికి ఎవరెవరో కొత్త వారు వచ్చి హడావిడిగా తిరుగుతుండడంతో అనుమానం వచ్చిన చుట్టూ పక్కల గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు వీరిని అడ్డగించి మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అంత తవ్వినా అక్కడ నిధులు దొరికింది లేదు. చివరాఖరికి వారి అత్యాశే వారిని కటకటాల పాలు చేసింది.
Read Also: BJP: బీజేపీ పార్లమెంటరీ బోర్డ్, ఎన్నికల కమిటీ ప్రకటన.. యోగి, గడ్కరీకి నోప్లేస్