తిరుమలలో భక్తుల రద్దీ భారీగా ఉంది.. గత రెండు రోజుల నుంచి భక్తులు తిరుమల కొండకు భారీ సంఖ్యలో వెళ్తున్నారు. డిసెంబర్ లో సెలవులు రావడంతో చివరి రెండు వారాల్లో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. దీంతో తిరుమల కొండకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. ఇక, ఈ ఏడాది చివరి నెల చివరి రెండు వారాలు శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా వస్తుండంతో కొద్దిగా రద్దీగానే ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీనివాసుడి దర్శనం కోసం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది.
Read Also: Singareni Elections: సింగరేణి ఎన్నికలపై ఉత్కంఠ.. నేడు హైకోర్టులో విచారణ
ఇక, నిన్న తిరుమల శ్రీవారిని 74 వేల 845 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. వీరిలో 26 వేల 122 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. కాగా, నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.44 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 20 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం బారులు తీరారు. సర్వ దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు మాత్రం స్వామి వారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు చెప్పారు.