చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు బీసీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్న విషయం తెలిసిందే. అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కార్యకర్తలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. నా చుట్టూ తిరగకండి.. ప్రదక్షిణలు చేస్తే పదవులు రావు అంటూ కార్యకర్తలకు సూచించారు. పదవులు మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి అంటే మీరు ప్రజలతో ఉండాలి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా గాని ఇన్ డైరెక్ట్ గా గాని పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు అని సూచించారు. మీరు ఆ పని చేస్తే పాముకి పాలు పోసినట్టేనని అన్నారు.
Also Read:Amitabh Bachchan:1990ల్లోనే అమితాబ్ బచ్చన్పై 55 కేసులు, 90 కోట్ల అప్పులు.. ఎలా అధిగమించారు?
అలా చేసే వారి మొత్తం వివరాలను నేను తెప్పించుకుంటున్నాను అని తెలిపారు. మాటలు కాదు ఓట్లు తెప్పించుకున్న వాడే విజేత. నా చుట్టూ తిరుగుతూ వీరుడు సూర్యుడు అని పొగడ్తలు చేస్తే ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. జీడి నెల్లూరు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారాలన్నారు. జీడి నెల్లూరు సభ్యత నమోదులో 90వ ర్యాంకు ఉంది. పేదల సేవ అనే మీటింగ్స్ 8 పెడితే 5 మీటింగులకు డుమ్మా కొట్టారు. మూడింటికి మాత్రమే ఎమ్మెల్యే అటెండ్ అయ్యారన్నారు. ఈ లెక్కల్లో నాకు ఏమీ సంబంధం ఉండదు.. చిత్రగుప్తుని లెక్కల్లాగా ఇక్కడ అన్ని రికార్డు అవుతుంటాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరి మీద ప్రజా అభిప్రాయ సేకరణ నిరంతరం కొనసాగుతూనే ఉందన్నారు.
Also Read:Gold Hunt: మీరు మారరా? వ్యూస్ కోసం గోల్డ్ హంట్ పేరుతో రీల్.. చివరకు ఏమైందంటే?
సోషల్ మీడియానే భవిష్యత్తు ఆయుధం… మనం చేస్తున్న పనులు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడానికి ఇదే సరైన వేదిక అని స్పష్టం చేశారు. ఎక్కడ ఎన్ని పనులు పెట్టుకున్నా కార్యకర్తలను కలవడం ఒక బాధ్యతగా పెట్టుకుంటాను అని తెలిపారు. కార్యకర్తలకు గౌరవం ఇవ్వడమే కాదు అవసరమైతే కొరడా జులిపిస్తాను అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. కార్యకర్తలతో 45 సంవత్సరాల అనుబంధం నాది.. గత ఎన్నికల్లో నా దగ్గరి స్నేహితులను సైతం ప్రజా ఆమోదం లేదని పక్కన పెట్టాను.. సీటు ఇవ్వలేను కావాలంటే కాఫీ, టీ ఇస్తా, డిన్నర్ పెడుతా.. కానీ, పార్టీనీ త్యాగం చేయాలేను అని చెప్పారు. ఇకపై నిరంతరం పార్టీ నేతలకు కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా నా ప్రణాళికలు ఉంటాయని సీఎం ప్రకటించారు.