చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత జగనుదేనని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మరోసారి విమర్శలు గుప్పించారు. జగన్ అసమర్ధ పాలనకు విద్యుత్ ఛార్జీల పెంపు నిదర్శనమని, స్విచ్ వేయకుండానే జగన్ ప్రజలను విద్యుత్ షాక్ లకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జగన్ ఇప్పటికీ ఐదు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.11,600 కోట్ల భారం మోపారని, ప్రస్తుత ఛార్జీల పెంపుతో ప్రజలపై ఏడాదికి మరో రూ.4,400 కోట్ల భారం పడనుందని ఆయన మండిపడ్డారు. తన చేతగానితనంతో ఒకవైపు విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న సీఎం జగన్ మరోవైపు ప్రజలపై పెనుభారం మోపుతున్నారని, పాలన చేతగాకపోతే దిగిపోవాలి. అంతేకానీ పన్నులు, ఛార్జీలు పెంచుతూ ప్రజలను దోచుకోకూడదని ఆయన విమర్శించారు.
ప్రతిపక్ష నాయకుడిగా జగన్ విద్యుత్ ఛార్జీలను పూర్తిగా తగ్గించేస్తానని అనేక సభల్లో చెప్పారన్నారు. ఇప్పడు పెంచుకుంటూ పోతూ ప్రజలను నయవంచన చేస్తున్నారని, చెత్తపన్ను దగ్గర నుంచి నిత్యావసర వస్తువులు, విద్యుత్ ఛార్జీలు వరకు ప్రతీది పెంచుకుంటూ పోతున్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలను పెంచలేదని, కేటగిరీలు మార్చి ప్రజలను దోచుకున్న జగన్ ఇప్పుడు ఏకంగా పేద, దిగువ మధ్యతరగతి వారిపై విద్యుత్ ఛార్జీలను 45 శాతం పెంచారని ఆయన మండిపడ్డారు.