ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మరో కొత్త డిమాండ్ను తెరపైకి తెచ్చారు. ఇటీవల గుంటూరులోని జిన్నా టవర్ సెంటర్ పేరును మార్చాలని చెప్పిన ఆయన.. తాజాగా విశాఖలోని కింగ్ జార్జ్ ఆస్పత్రి పేరును కూడా మార్చాలని డిమాండ్ చేశారు. అసలు కింగ్ జార్జ్ ఎవరని, ఇందులో కింగ్ ఎవరని? జార్జ్ ఎవరు? అని ప్రశ్నించారు. కింగ్ జార్జ్ పేరు బదులుగా తెన్నేటి విశ్వనాథం, గౌతు లచ్చన్న పేర్లు పెట్టాలన్నారు.
Read Also: APSRTC ఉద్యోగులకు న్యూ ఇయర్ కానుక
అలాగే ధవళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన ఆర్థర్ కాటన్తో పాటు వీరన్న అనే ఇంజినీర్నూ స్మరించుకోవాలని సోము వీర్రాజు సూచించారు. మరోవైపు చీప్ లిక్కర్ను రూ.50కే ఇస్తామని ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలను సోము వీర్రాజు సమర్థించుకున్నారు. తనను సారాయి వీర్రాజు అంటూ సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారని… తాను సారాయి వీర్రాజును కాదని.. బియ్యం వీర్రాజుని, సిమెంటు వీర్రాజుని, కోడిగుడ్ల వీర్రాజును అంటూ స్పష్టం చేశారు. ఇప్పుడు తాను చేస్తున్న ప్రతి డిమాండ్ను 2024లో బీజేపీ మ్యానిఫెస్టోలో పెడతామని సోము వీర్రాజు తెలిపారు.