AP NDA: ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే కూటమి పార్టీల మధ్య రాజ్యసభ స్థానాల పంపకం దాదాపు ఖరారైంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రానికి కేటాయించిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో మూడు టీడీపీకి, ఒక స్థానం జనసేనకు దక్కనున్నాయి. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. అమరావతిలో జరిగిన కూటమి పార్టీల సమావేశం అనంతరం మాట్లాడిన పల్లా శ్రీనివాస్, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికతో పాటు కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సంయుక్త కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలను వివరించేందుకు విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఈ నెల 9వ తేదీన తిరుపతిలో సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే 13, 16, 17, 18, 19 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యమని వివరించారు. ఎన్నికల సంఘం చేపడుతున్న ‘సర్’ (SIR) ప్రక్రియపై కూడా సమావేశంలో చర్చ జరిగినట్లు పల్లా శ్రీనివాస్ తెలిపారు. ఈ ప్రక్రియపై ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులకు మరింత అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు పల్లా శ్రీనివాస్..
ఇక, జనసేన పార్టీ తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారని వెల్లడించారు. ఈ నెల 9 నుంచి 20వ తేదీ వరకు మూడు భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు నాదెండ్ల మనోహర్ చెప్పారు. జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ, ప్రధాని మోడీ 12 ఏళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, పేదల సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 12న అమరావతిలో జరిగే సభలో సుపరిపాలన ఫలితాలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నట్లు వెల్లడించారు. మొత్తంగా రాజ్యసభ స్థానాల పంపకం, రెండేళ్ల కూటమి పాలన ప్రచారం, మోడీ ప్రభుత్వ 12 ఏళ్ల విజయోత్సవాల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి రాష్ట్రవ్యాప్తంగా విస్తృత రాజకీయ కార్యాచరణకు సిద్ధమవుతోంది.
