తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ను గత రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ శ్రేణులు ఒక్కసారి భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో నేడు సికింద్రాబాద్లోని మహ్మత్మాగాంధీ విగ్రహం నుంచి ప్యారడైజ్ సర్కిల్ వరకు బీజేపీ శ్రేణులు భారీగా ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీ ఈ రోజు సాయంత్ర 5 గంటలకు నిర్వహించనున్నట్లు బీజేపీ నేతలు వెల్లడించారు. అయితే ఈ ర్యాలీలో పాల్గొనడానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రానున్నారు.
అయితే ఆయన ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వచ్చి అక్కడి నుంచి సికింద్రాబాద్ మహాత్మాగాంధీ విగ్రహం వద్దకు రోడ్డ మార్గంలో చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో జేపీ నడ్డాను అడ్డుకునేందుకు పోలీసులు ఇప్పటికే శంషాబాద్కు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కరోనా ఆంక్షల జీవోను జాయింట్ సీపీ కార్తికేయ జేపీ నడ్డాకు వివరించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే నాలుగు కారణాలతో పోలీసులు బీజేపీ ర్యాలీని నిరాకరించారు. 1. ట్రాఫిక్కు అంతరాయం, 2. బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వస్తారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్, 3.కార్యకర్తల సంఖ్యపై స్పష్టత ఇవ్వని బీజేపీ, 4. ఒమిక్రాన్ వేరియంట్ పెరిగే ప్రమాదం ఉందని కారణాలతో పోలీసులు బీజేపీ ర్యాలీని అడ్డుకుంటున్నారు.