తెలంగాణకు కృష్ణా జలాల్లో వాటా కేటాయించే వరకు గెజిట్ నోటిఫికేషన్ ఆపాలని కోరినట్టు తెలిపారు తెలంగాణ సాగునీటిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్.. జలసౌధలో ఇవాళ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం జరిగింది.. కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నీటిపారుదల శాఖ అధికారులు హాజరయ్యారు. కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ అమలుపైనే ప్రధానంగా చర్చ జరిగింది.. ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెచ్చే అంశంతో పాటు ఉప సంఘం నివేదికపై కృష్ణా బోర్డు సమావేశంలో చర్చించారు..
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన తెలంగాణ ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్… 65 కేంద్రాలు గెజిట్ నోటిఫికేషన్లో ఉన్నాయని.. సాగర్ పై 18, శ్రీశైలంపై 12 కేంద్రాలు ఇవ్వాలని బోర్డు ప్రతిపాదించిందని తెలిపారు.. బోర్డు నుంచి ప్రతిపాదనలు వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్న ఆయన.. తెలంగాణకు కృష్ణా జలాల్లో వాటా కేటాయించే వరకు గెజిట్ నోటిఫికేషన్ ఆపాలని ఈ సమావేశంలో కోరినట్టు వెల్లడించారు.. ఇక, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు బోర్డు పరిధిలోకి తీసుకోవాలని ఏపీ కోరిందని.. ఆ ప్రతిపాదనకు మేం అంగీకరించలేదని తేల్చేశారు.. మాకు విద్యుత్ ఉత్పత్తి చాలా అవసరమని చెప్పామన్న ఆయన.. ప్రాజెక్టు యాజమాన్య హక్కుల విషయమై న్యాయసలహా ఆడిగామని తెలిపారు రజత్ కుమార్.