తమిళనాడులో చిన్నమ్మగా ప్రసిద్ధి చెందిన దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలి శశికళ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు పావులు కదుపుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అన్నా డీఎంకే పార్టీ ఓటమిపాలైంది. ఈ ఎన్నికలకు ముందు తాను రాజకీయాల్లోకి రావడం లేదని, ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. జైలునుంచి రిలీజ్ అయ్యాక అన్నాడీఎంకేలో చక్రం తిప్పేందుకు ప్రయత్నించగా కుదరలేదు. అనుకూల వర్గం కూడా ఆమెకు దూరంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఇటీవలే తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి, జయలలితకు అనుంగ శిష్యుడు ఓ పన్నీర్ సెల్వం భార్య మరణించిన సమయంలో శశికళ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. ఆ తరువాత తిరిగి ఆమె రాజకీయాల్లోకి వచ్చేందుకు పావులు కదుపుతున్న సమయంలో ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆమెకు చెందిన రూ.100 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. జయలలిత మొదటిసారి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో ఆమె నిచ్చెలి శశికళ పయనీర్ గ్రామంలో 24 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అప్పట్లో రూ.20 లక్షలతో కొనుగోలు చేసిన ఈ ఆస్తుల విలువ ఇప్పుడు రూ.100 కోట్లకు పైగా ఉంది. ఈ ఆస్తులను ఆదాయానికి మించి ఆస్తులుగా కోర్టు పేర్కొన్నది. దీంతో ఈడీ ఈ ఆస్తులను ఇప్పుడు జప్తు చేసింది. ఎలాగైనా రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్న శశికళకు ఇది ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు.
Read: వైరల్: దుబాయ్ షేక్ నోట అచ్చ తెలుగు పాట… నెట్టింట వైరల్…