టీఆర్ఎస్ సర్కార్లో పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు హుజురాబాద్ ఉప ఎన్నికల బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేదర్.. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. దళిత జాతి ఆత్మగౌరవం కోసం నా చిన్న నాడే కొట్లాడి మా కుల బహిష్కరణకు గురైన వాళ్లం.. అలాంటి కుటుంబం మాది అని గుర్తు చేసుకున్నారు.. ఇక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మీ హృదయాల్లో చోటు సంపాదించుకున్న వాడిని.. కేసీఆర్తో ఆరేళ్లుగా అనుభవిస్తున్న బాధ నుండి విముక్తి పొందిన వాడిని.. మంత్రి వర్గంలో ఉండి కూడా ఆయనకు చెప్పినం.. చెపితే వినే గొప్ప మనసు కాదు కేసీఆర్.. నాకు మాత్రమే తెలివి ఉంది అనుకొనే వాడు ఆయన అంటూ కామెంట్ చేశారు. 2018లోపే మా లాంటి వాళ్ల బొందిగ పిసకాలని హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన వాడికి డబ్బులు ఇచ్చి కరపత్రాలు కొట్టించారని ఆరోపించిన ఈటల.. కాంగ్రెస్ అభ్యర్థికి డబ్బులు ఇచ్చి నన్ను ఓడగొట్టలనీ చూశారని ఫైర్ అయ్యారు.
ఇక, జెండాకి ఓనర్లం మేమే అని గొంతెత్తి మాట్లాడితేనే హరీష్రావుకి మంత్రి పదవి వచ్చిందని.. మరోసారి హరీష్రావు ప్రస్తావన తెచ్చారు ఈటల.. అయన అంతరాత్మను అడగండి.. పదవుల కోసం పెదవులు మూసింది హరీష్ అంటూ కామెంట్ చేసిన ఆయన.. ఇక, సీఎం కుర్చీకి ఎసరు పెట్టింది హరీష్రావు, కేటీఆర్ అంటూ సంచలన కామెంట్ చేవారు. మరోవైపు.. కేసీఆర్ కుటుంబం అబద్దాల కోరులు అని మండిపడ్డ ఈటల రాజేందర్.. దళిత ముఖ్యమంత్రి ఇస్తానని ఇవ్వని మోసగాడు.. ఉప ముఖ్యమంత్రి ఇచ్చి తీసివేసి అవమానించాడు.. దళిత అధికారులకు గౌరవం లేదు.. ప్రదీప్ చంద్రకు మీరు ఇచ్చిన గౌరవం ఏంది? అకునూరి మురళి ఉసురు పోసుకున్నవాడు..? సోషల్ వెల్ఫేర్ స్కూళ్లలో చదివే పిల్లలు ఎవరెస్ట్ అంత ఎదగాలని ఆశించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని పొమ్మనలేక పొగబెట్టి బయటికి పంపించిండు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక, హుజూరాబాద్ ఎన్నికల కోసమే దళితబంధు పెట్టారని విమర్శించిన ఈటల.. 46 వేల ఓట్లు ఉన్న కులం మన దళితులు.. లెక్క చూసుకొని ఓట్ల కోసం 10 లక్షల స్కీం తీసుకువచ్చిండు అని కామెంట్ చేశారు. నేను రాజీనామా చెయ్యకపోతే మీకు దళిత బంధు వచ్చేదా? అని ప్రశ్నించిన ఆయన.. మన పుట్టుకకు కారణం అయిన అమ్మ నాన్నను ఎలా మర్చి పోమో.. అలాగే నన్ను కూడా మర్చిపోకండి అని విజ్ఞప్తి చేశారు.