గజరాజులకు ఆకలి ఎక్కువ. అందులోనూ చెరకు గడలు కనిపిస్తే చాలు వాటి ఆనందానికి అవధులు వుండవు. అందుకే పంట పొలాలపై పడి అవి బీభత్సం సృష్టిస్తుంటాయి. అయితే కేరళలోని ఆ గజరాజుకి మాత్రం రేషన్ బియ్యం అంటే ఇష్టం. ఎక్కడ రేషన్ బియ్యం కనిపించినా ఏనుగు లాగేస్తోంది. దీంతో ఇడుక్కి జిల్లాలో మూడురోజులుగా రేషన్ బియ్యం ప్రజలకు అందించడం లేదు.
రాత్రికిరాత్రే రేషన్ దుకాణంలోని బియ్యం బస్తాలు మాయం అయిపోతున్నాయి. దొంగలు చేశారని కొందరు భావించారు. అయితే సీసీ టీవీల్లో లభ్యమయిన వీడియో చూసి అవాక్కవ్వడం అధికారుల వంతయింది. ఆకలితో అలమటిస్తున్న ఏనుగు రేషన్ దుకాణాలపై దాడి చేసి బియ్యాన్ని తినేస్తోందట. దీంతో స్థానికులు ఆ ఏనుగుకి పేరు కూడా పెట్టారు. అదేంటంటే ‘అరికంబన్’ అంటే బియ్యం దొంగ. అరికంబన్ను తరిమేందుకు స్థానికులు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అది అక్కడ నుంచి ఒక్క అడుగు కూడా కదలడం లేదట. పైగా వారిపై దాడిచేస్తుందేమో అని భయపడుతున్నారు. రేషన్ దుకాణంలో బియ్యం లేకపోతే ఏకంగా ఇళ్లపై దాడి చేస్తోంది. దీంతో ప్రజలు ప్రాణ భయంతో టెన్షన్ పడుతున్నారు.