సంక్రాంతి, క్రిస్మస్ సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. తూర్పుగోదావరి జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళేవారికి గుడ్ న్యూస్ అందించింది. క్రిస్మస్, సంక్రాంతి పండగల దృష్ట్యా దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సుల్లో 60 రోజుల ముందుగా టికెట్ రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పించింది.
హైదరాబాద్ నుంచి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చే ప్రయాణికుల డిమాండ్ను బట్టి ప్రస్తుతానికి ఏడు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి అమలాపురానికి మూడు, కాకినాడకు రెండు, రాజమండ్రికి ఒకటి, రాజోలుకు ఒకటి చొప్పున ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి, ప్రత్యేక బస్సు సర్వీసులకు ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్టీసీ బస్సుల్లో అన్ని కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తామని చెప్పారు.