ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలజగడం కొనసాగుతూనే ఉంది.. కేఆర్ఎంబీకి, కేంద్రానికి, జలశక్తిశాఖకు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు ఇలా.. రెండు రాష్ట్రాలు లేఖలు రాస్తూనే ఉన్నాయి.. తాజాగా కృష్ణా నది యాజమాన్య బోర్డుకు మరో లేఖ రాసింది ఏపీ. ఇవాళ, కేఆర్ఎంబీకి లేఖ రాశారు ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి… కృష్ణా నదిపై జలాశయాలన్నీ పొంగి పొర్లుతున్నాయి.. గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలివేయాల్సి వస్తోందన్న ఆయన.. వరద నియంత్రణలో భాగంగా ఈ నీటిని ఎగువన శ్రీశైలం జలాశయం నుంచి మళ్లించకపోతే పులిచింతల, ప్రకాశం బ్యారేజి ఫోర్ షోర్ లో, దిగువన పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని తెలిపారు.. ఈ పరిస్థితుల్లో ఎగువనే వివిధ మార్గాల ద్వారా నీటిని మళ్లించేందుకు అనుమతి ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
ఇది కేవలం వరద జలాల మళ్లింపు మాత్రమేనని లేఖలో పేర్కొన్నారు ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీ నారాయణరెడ్డి.. ఈ మళ్లింపును ఏ రకంగాను ఆయా రాష్ట్రాలకు కేటాయించిన వాటాలో భాగంగా పరిగణనలోకి తీసుకోకూడదన్న ఆయన.. శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి జలవిద్యుత్తు ఉత్పత్తికి అనుమతి అడిగిన ఆంధ్రప్రదేశ్ వరద నీటిని మళ్లించకపోతే దిగువన ఇబ్బందులు ఎదురవుతాయన్నారు.. రాష్ట్ర విభజన చట్టం 85 (7) ఈ పేరా 6 ప్రకారం ప్రకృతి విపత్తులను నిర్వహణలో ఆయా రాష్ట్రాలే బాధ్యత తీసుకోవాలని, ఇందుకు బోర్డులు సలహాలు, సూచనలు అందిస్తాయని పేర్కొంటోందని పేర్కొన్న ఆయన.. ఈ విషయంలో బోర్డులకు తమ ఆదేశాలు అమలు చేసేలా విస్తృత అధికారాలు ఉన్నాయన్నారు.. వరదల సమయంలో నీటి విడుదల, డ్యాంలు, జల విద్యుత్ కేంద్రాల నిర్వహణ విషయంలో బోర్డుల ఆదేశాలను రెండు రాష్ట్రాలు అమలు చేయాల్సి ఉంటుందన్నారు.
ఇక, ప్రస్తుత పరిస్థితుల్లో కృష్ణా నదిలో మిగులు జలాలను కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి జలవిద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు అనుమతించాలని మరోసారి కోరుతున్నామని లేఖలో పేర్కొన్నారు ఏపీ ఈఎన్సీ.. జాతీయ ప్రయోజనాలకు అవసరమైన విద్యుత్తు ఉత్పత్తి చేయకుండా ఆ నీరు ఎవరికీ ఉపయోగపడకుండా వృథా అవుతుందన్న ఆయన.. ప్రస్తుతం కృష్ణానదిపై జూరాల నుంచి ప్రకాశం బ్యారేజి వరకు అన్ని జలాశయాలు నిండుకుండల్లా ఉన్నాయన్నారు.. గడిచిన రెండు సంవత్సరాల్లో ఇలాంటి సందర్భాలే ఎదురైన సమయంలో ఎగువన వివిధ మార్గాల ద్వారా నీటిని మళ్లించామని కేఆర్ఎంబీ దృష్టికి తీసుకెళ్లారు.. ఆయా చోట్ల తాగు, సాగు నీటి అవసరం ఉందో లేదో అన్న విషయంతో సంబంధం లేకుండానే చేశామని లేఖలో పేర్కొన్నారు నారాయణరెడ్డి.