యాదాద్రి జిల్లా భువనగిరిలో ఆర్అండ్బీ శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటించారు. టీపీసీసీ కార్యదర్శి పొత్నక్ ప్రమోద్ కుమార్ సతీమణి రోజా చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయనతో పాటు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తీన్మార్ మల్లన్న విషయంలో తనకు మాట్లాడేంత టైమ్ లేదని.. మాట్లాడం వేస్ట్ అని అన్నారు. తీన్మార్ మల్లన్నకు టీపీసీసీ, ఏఐసీసీ, క్రమశిక్షణ చైర్మన్ చిన్నారెడ్డి నోటీసులు ఇచ్చినట్లు పేపర్లో చూశానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేలో 56.6 శాతం బీసీలు ఉన్నట్లుగా తేల్చామని తెలిపారు. బడుగు బలహీన వర్గాలను అన్ని రంగాల్లో పైన తీసుకొని రావడమే తమ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: K.V.Ramana Reddy: పార్టీ ఫిరాయింపులపై కామారెడ్డి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..
స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ఖచ్చితంగా 42 శాతం పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. వర్గీకరణ విషయంలో కూడా వెనకడుగు వేసే ప్రసక్తి లేదని తెలిపారు. 90 శాతం ఉన్న జనాభా కోసమే తెలంగాణ వచ్చింది.. దొరలు, భూస్వాములు ఫామ్ హౌస్లో ఉండేందుకు కాదని దుయ్యబట్టారు. ఫామ్ హౌస్లో ఉంటూ కులగణలో పాల్గొనకుండా ఉన్న వాళ్లకు మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ లెక్క తాము హడావిడిగా సర్వే చేయలేదని.. తాము చేసిన సర్వే ప్రజల ముందు పెట్టామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
Read Also: RGIA : శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన