TGNPDCL power demand : తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (TGNPDCL) పరిధిలో విద్యుత్ వినియోగం సరికొత్త రికార్డును సృష్టించింది. సంస్థ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అత్యంత గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైనట్లు సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి వెల్లడించారు. సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో కనిపించే గరిష్ట వినియోగం, ఈసారి ముందే రావడం గమనార్హం. గత ఏడాది మార్చి 11వ తేదీన నమోదైన 5,816 మెగావాట్ల రికార్డును అధిగమిస్తూ, ఈరోజు ఏకంగా 6,057 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఎండల తీవ్రత పెరగడం , వ్యవసాయ అవసరాల కోసం విద్యుత్ వినియోగం భారీగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని అధికారులు విశ్లేషిస్తున్నారు.
Adulterated Milk: కల్తీ పాల ఘటనలో 11 మంది పరిస్థితి విషమం.. మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ స్థాయిలో డిమాండ్ పెరిగినప్పటికీ, వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు సంస్థ ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉందని సీఎండీ భరోసా ఇచ్చారు. పెరిగిన లోడ్ను సమర్థవంతంగా తట్టుకునేందుకు వీలుగా క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలను భారీగా మెరుగుపరిచినట్లు ఆయన వివరించారు. ఇందులో భాగంగా ఇప్పటికే 35 కొత్త 33/11 కేవీ సబ్స్టేషన్లను ఛార్జ్ చేయడంతో పాటు, అదనంగా 366 పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. అలాగే ఓవర్లోడ్ సమస్య తలెత్తకుండా సుమారు 7,600 ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా సరఫరాలో నాణ్యతను పెంచినట్లు పేర్కొన్నారు.
మౌలిక సదుపాయాల బలోపేతంలో భాగంగా పంపిణీ వ్యవస్థలో కీలక మార్పులు చేపట్టారు. ముఖ్యంగా ఓవర్లోడ్ అధికంగా ఉన్న ఎనిమిది 33 కేవీ ఫీడర్లను విభజించి లోడ్ బ్యాలెన్సింగ్ చేయడంతో పాటు, సుమారు 1,200 కిలోమీటర్ల మేర ప్రత్యామ్నాయ 33 కేవీ లైన్లను అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నిరంతరాయంగా విద్యుత్ అందించే అవకాశం ఉంటుంది. వేసవి కాలం దృష్ట్యా మున్ముందు డిమాండ్ ఇంకా పెరిగినా, నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసేందుకు ఎన్పీడీసీఎల్ యంత్రాంగం పూర్తి సన్నద్ధతతో ఉందని సీఎండీ స్పష్టం చేశారు.
US-Iran: యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నుంచి దాడులు.. ఖమేనీ లక్ష్యంగా క్షిపణులు ప్రయోగం