వరిదిగుబడిలో తెలంగాణ రాష్ట్రం పంజాబ్ ను మించి పోయిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే నని ఆయన కొనియాడారు. అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి వర్జీనియా రాష్ట్రం ఆల్డి నగరంలో ఏనుగు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐల మీట్&గ్రీట్ నిర్వహించారు. సుమారు 300 మంది ఎన్ఆర్ఐలు ఇందులో పాల్గొన్నారు.
కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పై ఎన్ఆర్ఐలు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి జగదీష్ రెడ్డి సమాధానమిచ్చారు. ఎన్ఆర్ఐల డెవలప్మెంట్ ఫోరమ్ కు చెందిన బొజ్జ అమరేందర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. వరి దిగుబడిలో రాష్ట్రం పంజాబ్ ను మించిపోయిందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి .
రైతు పండించిన పంటను కొనుగోలు చేయడంలో కేంద్రం చేతులు ఎత్తేస్తే సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో స్పందించి కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టి అమలుపరిచిన మిషన్ భగీరథతో ఫ్లోరోసిస్ రహిత రాష్ట్రంగా తెలంగాణ మారిందన్నారు.
కేంద్రప్రభుత్వ రంగ సంస్థలతో సహా దేశ, విదేశీ సంస్థలు కితాబిచ్చాయన్నారు. విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రం యావత్ భారతదేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. అందుకు సీఎం కేసీఆర్ దార్శనికతకు అద్దం పడుతుందన్నారు. 24 గంటల నిరంతర విద్యుత్ నందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణా రికార్డులకెక్కిందన్నారు. అద్భుతమైన పాలనతో సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రగతి పై చర్చను నిర్వహించిన కార్యక్రమ నిర్వాహకులు ఏనుగు శ్రీనివాస్ రెడ్డని మంత్రి అభినందించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నంద్యాల దయాకర్ రెడ్డి తో పాటు ఎన్ఆర్ఐలు శ్రీనివాస రెడ్డి, మనోహర్, కాల్వల విషు, పాదురు శ్రవణ్, అమరేందర్ బొజ్జ, సుధా కొండరాపు, బాబు రావు, తదితరులు పాల్గొన్నారు.
Boney Kapoor : సైబర్ ఫిషింగ్ వలలో బోనీ కపూర్.. 4 లక్షలు హాంఫట్..