తెలంగాణ రాజకీయాల్లో ఈ మధ్య హాట్ టాపిక్గా మారిన పేరు ఏదైనా ఉంది అంటే..! అది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిదే.. ఓవైపు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని అధికార టీఆర్ఎస్ పార్టీ చెబుతున్నా.. ముందస్తు ముంచుకొస్తోంది.. ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చు అనే తరహాలో.. తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ.. ఆపరేషన్ ఆకర్ష్తో ఇతర పార్టీల నేతలను ఆహ్వానించే పనిలో పడిపోయారు.. ఇప్పటికే పలువురు నేతలు.. అటు బీజేపీలో.. ఇటు కాంగ్రెస్లో చేరుతూనే ఉన్నారు.. ఈ సమయంలో.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.. బీజేపీలో చేరేందుకు సిద్ధం అయ్యారు.. బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ సహా ఆ పార్టీ నేతలు ఈ పరిణామాన్ని స్వాగతిస్తున్నా.. కాంగ్రెస్ నేతలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీలో ఆయన సోదరుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కీలక బాధ్యతల్లో ఉన్నారు.. ఈ నేపథ్యంలో.. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి.. ఈ గట్టునే ఉంటారా? ఆ గట్టుకు వెళ్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
Read Also: Chikoti Praveen: ఎవరీ చికోటి ప్రవీణ్..?
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే.. ఇలా వివిధ హోదాలో పనిచేశారు.. అయితే, రెండోసారి తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆయన వైఖరిలో మార్పు వచ్చింది.. మాటల్లో తేడా కనబడింది.. కాంగ్రెస్ పని అయిపోయింది.. ఇక, టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని.. ప్రధాని నరేంద్ర మోడీ బలమైన నేతగా కీర్తించారు.. దీనిపై పెద్ద రచ్చే జరిగినా.. అది టీ కప్పులో తుఫాన్గా కొంతకాలానికి కనుమరుగైపోయింది.. కొన్ని సందర్భాల్లో పీసీసీపై, పార్టీ అధిష్టానంపై ఆయన హాట్ కామెంట్లు చేసినా.. కాంగ్రెస్లో కొనసాగుతూ వచ్చిఆరు.. కానీ, ఇప్పుడు మరోసారి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ హాట్ టాపిక్గా మారింది. తాను ప్రాతినథ్యం వహిస్తోన్న మునుగోడు నియోజకవర్గంలోని వివిధ మండలాల నేతలు, తన అనుచరులతో వరుసగా సమావేశాలు నిర్వహించిన ఆయన.. పార్టీ మారడం, కాంగ్రెస్ పార్టీలో తనకు జరిగిన అన్యాయం.. కాంగ్రెస్కు రాజీనామా చేయడం.. ఉప ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుంది? అనే విషయాలపై సలహాలు తీసుకున్నారు.. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి.. పీడ్ బ్యాక్ కూడా కోరారు.. అయితే, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరుతారని ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ చెబుతుండగా… రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని.. ఉండేలా చూస్తామంటూ సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క తెలిపారు.. దీంతో అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్.. మధ్యలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనే విధంగా పరిస్థితి మారిపోయింది.. ఇంతకీ ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా? లేక కమలం పార్టీ కండువా కప్పుకుంటారా? అనేది ఉత్కంఠగా మారింది..
ఒకవేళ కోమటిరెడ్డి పార్టీ మారితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా..? ఉప ఎన్నికలను ఎదుర్కొంటారా? అనేది మాత్రం అంతుచిక్కడం లేదు.. కోమటిరెడ్డి బీజేపీలో చేరడానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది.. బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ మరికొందరు కీలక నేతలతో ఢిల్లీ వెళ్తారని.. బీజేపీ కండువా కప్పుకుంటారనే వార్తలు గుప్పుమన్నాయి.. ఇంతలోనే సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన కాంగ్రెస్ హైకమాండ్.. ఢిల్లీలో సమావేశం నిర్వహించింది. కేసీ వేణుగోపాల్ నివాసంలో ఠాగూర్, రేవంత్రెడ్డి, భట్టి, ఉత్తమ్కుమార్ రెడ్డి సుదీర్ఘంగా రాజగోపాల్రెడ్డి ఎపిసోడ్పై చర్చించారు.. ప్రస్తుత పరిస్థితుల్లో ఓ బలమైన నేతగా ఉన్న ఎమ్మెల్యేను వదులుకోవద్దు అనే నిర్ణయానికి వచ్చారు.. ఆయనను బుజ్జగించే బాధ్యతను ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నెత్తినపెట్టారు.. ఇక, ట్రబుల్ షూటర్ గా పేరున్న దిగ్విజయ్ సింగ్ ను కూడా రంగంలోకి దింపింది కాంగ్రెస్ హైకమాండ్.. ఈ పరిణామాలను గమనిస్తున్న బీజేపీ.. లేట్ చేస్తే.. కోమటిరెడ్డి రాకకు బ్రేక్లు పడే ప్రమాదం ఉందని గ్రహించి.. వెంటనే బీజేపీలో చేరాలంటూ కోమటిరెడ్డిపై ఒత్తిడి పెంచుతున్నట్టు సమాచారం.
పార్టీలో చేరికపై బీజేపీ నుంచి ఒత్తిడితో పాటు.. కండీషన్ కూడా ఉందట.. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి వస్తేనే.. కండువా కప్పుతామని స్పష్టం చేశారట.. దీంతో, రాజీనామా చేద్దామా? వద్దా..? రాజీనామా చేసి బైపోల్కు వెళ్తే.. గెలుస్తామా? ఉప ఎన్నిక కాబట్టి.. ఓడిపోతే పరిస్థితి ఏంటి? అనే విషయాలపై తర్జనభర్జన పడుతున్నారట.. అయితే, రాజీనామా చేయడం మాత్రం కోమటిరెడ్డికి ఇష్టం లేదనే టాక్ నడుస్తోంది.. అందుకు తగ్గట్టుగానే తన వ్యూహాలను అమలు చేస్తూ.. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారని.. పీసీసీ, సీఎల్పీ, కాంగ్రెస్ అధిష్టానం.. ఇలా అందరినీ టార్గెట్ చేస్తున్నారని.. పొగపెడితే.. వాళ్లే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారనే భావనలో కూడా ఉన్నట్టుగా టాక్ నడుస్తోంది. అయితే, కాంగ్రెస్ కూడా రాజగోపాల్రెడ్డి విషయంలో దూకుడుగా వెళ్లడం లేదు.. క్రమశిక్షణా చర్యలకు సిద్ధం అవుతుందనే వార్తలు వస్తున్నా.. వేచిచూసే ధోరణిలోనే వెళ్తోంది.. ఈ పరిణామాలతో.. కాంగ్రెస్లోనే ఉండాలా? రాజీనామా చేయాలా? బీజేపీ కండువా కప్పుకోవాలా? ఇలా ఏ విషయాన్ని కూడా తేల్చుకోలేక డైలమాలో పడిపోయిన రాజగోపాల్రెడ్డి.. క్యాడర్ను కూడా ఆయోమయానికి గురిచేస్తున్నారనే టాక్ నడుస్తోంది.. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కాబట్టి.. మరి ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎలాంటి స్టెప్ తీసుకుంటారో వేచిచూడాలి. మరోవైపు, సోషల్ మీడియాలో రాజగోపాల్రెడ్డిపై జోకులు కూడా పేలుతున్నాయి..