తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఆగమనం కొంత ఆలస్యమైన వచ్చినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో ప్రవేశించాల్సిన నైరుతి రుతుపవనాలు ఇంకా రాకపోవడంతో ఏరువాకకు సిద్ధం కావాల్సిన రైతన్నల్లో కొంత ఆందోళన నెలకొంది. అంతేకాకుండా.. తెలంగాణ వ్యాప్తంగా భానుడి ప్రతాపాగ్నిలో ఉడికిపోతున్న తెలంగాణ వాసులు సైతం నైరుతు రుతుపవనాల కోసం చూస్తున్నారు. అయితే తాజాగా తెలంగాణ ప్రజలకు వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా వరకు విస్తరించాయని వెల్లడించింది. మరో రెండ్రోజుల్లో రాష్ట్రంలోని ఇతర భాగాలకు విస్తరిస్తాయని వెల్లడించింది వాతావరణ శాఖ.
రుతుపవనాల ప్రభావంతో మూడ్రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు కూడా వీస్తాయని పేర్కొంది. వాస్తవానికి ఈ నెల 8న తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే, కర్ణాటక, రాయలసీమ ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో రుతుపవనాల ఆగమనానికి ఆలస్యమైంది.