మేడారం మహాజాతర అత్యంత వైభవంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముగియడంపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. గత జాతరల కంటే మెరుగైన ఏర్పాట్లు చేశామని, అమ్మవార్ల ఆశీస్సులతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేశారని ఆమె కొనియాడారు. ఈ ఏడాది జాతర అంచనాలకు మించి జరిగిందని మంత్రి తెలిపారు. “క్లాస్, మాస్ అనే తేడా లేకుండా హైక్లాస్ పీపుల్ కూడా భారీ సంఖ్యలో తరలివచ్చారు. సుమారు రెండున్నర కోట్ల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నాం” అని ఆమె పేర్కొన్నారు. మరో ఒకటి రెండు రోజుల్లో ‘తిరుగు జాతర’ నిర్వహణతో ఈ వేడుకలు పూర్తిస్థాయిలో ముగుస్తాయని వెల్లడించారు.
India-US Trade deal: “అమెరికాతో అత్యుత్తమ ఒప్పందం”.. ట్రేడ్ డీల్పై కేంద్రం కీలక ప్రకటన..
జాతర ఏర్పాట్లపై కొంతమంది కావాలనే విష ప్రచారం చేశారని సీతక్క మండిపడ్డారు. ముఖ్యంగా ఒక చిన్న దొంగతనం ఘటనను భూతద్దంలో చూపిస్తూ, జాతర ఏర్పాట్లు విఫలమయ్యాయనే రీతిలో సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వ్యాప్తి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, వాస్తవ పరిస్థితులను గమనించిన ప్రతిపక్ష నాయకులు సైతం ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసించడం సంతోషకరమని ఆమె అన్నారు. జాతరలో మంత్రి సీతక్క చేసిన నృత్యంపై వచ్చిన వ్యాఖ్యలకు ఆమె దీటుగా సమాధానమిచ్చారు. “మా ఆదివాసీ సంస్కృతిలో నృత్యం అనేది ఒక భాగం. విదేశాల నుంచి వచ్చే వారు కూడా మా నృత్యాలను ఇష్టపడి చేస్తున్నారు. అలాంటప్పుడు మా సొంత గడ్డపై, మా సంస్కృతిలో భాగంగా నేను నృత్యం చేయడంలో తప్పేముంది?” అని ప్రశ్నించారు.
ఇది తన మూలాలకు, ప్రజలకు ఇచ్చే గౌరవమని స్పష్టం చేశారు. వచ్చే జాతర నాటికి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా మేడారం చుట్టుపక్కల ఉన్న రోడ్లను వెడల్పు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే, త్వరలో రాబోయే గోదావరి పుష్కరాల గురించి ములుగు జిల్లా పరిధిలో చేపట్టాల్సిన పనులపై అధికారులతో త్వరలోనే సమీక్షా సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.