ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించగానే పోటీపరీక్షల శిక్షణ కేంద్రాలకు ప్రస్తుతం డిమాండ్ పెరిగింది. 80 వేల ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో విద్యార్థులకు నాణ్యమైన ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వీటికోసం ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో నిరుద్యోగ యువత వేలకు వేలు ఖర్చు చేయకుండా ఎక్కడికక్కడ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు.
మహేశ్వరం నియోజకవర్గంలో ఇప్పటికే తుక్కుగూడలో ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు.. ఇందులో 500 మంది వరకు శిక్షణ పొందుతుందన్నారని అన్నారు. జులై 11 నుంచి బడంగ్పేటలో శిక్షణా కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. శిక్షణ తీసుకునే విద్యార్థులు మున్సిపల్ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. అనంతరం మెటీరియల్ కూడా ఉచితంగా అందజేస్తామన్నారు. జిల్లా గ్రంథాలయంలో ఈ శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అన్ని రకాల పోటీ పరీక్షల పుస్తకాలు, మెటీరియల్ అందుబాటులో ఉంచినట్లు మంత్రి తెలిపారు.