KTR on Kaleshwaram: కాళేశ్వరంపై కక్ష.. రైతన్నకు శిక్ష.. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు!

Cinema

Cinema

KTR on Kaleshwaram: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యంగా సాగునీటి రంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తూ రైతులకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రిటైర్డ్ ఇంజినీర్లు, సర్వీస్‌లో ఉన్న ఇంజినీర్లు కూడా నీటిని ఎత్తిపోసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీలకు రూ.200 కోట్లు, మెస్సీ ఫుట్‌బాల్ కార్యక్రమానికి రూ.100 కోట్లు ఖర్చు చేశారని ప్రస్తావించిన కేటీఆర్.. అందులో కొంత మొత్తాన్ని సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించినా రైతులకు ప్రయోజనం కలిగేదని అన్నారు.

చిన్న కాఫర్ డ్యామ్ నిర్మిస్తే నీటిని లిఫ్ట్ చేయవచ్చని ఇంజినీర్లు సూచించినా ప్రభుత్వం స్పందించడం లేదని కేటీఆర్ విమర్శించారు. నీటి సమస్యలపై ప్రభుత్వానికి లేఖలు రాసిన రిటైర్డ్ ఇంజినీర్లను బెదిరించడం సరికాదన్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన శ్యామ్ ప్రసాద్ రెడ్డిని అవమానించారని ఆరోపిస్తూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి రంగంలో ఒక్క కొత్త డ్యామ్ లేదా బ్యారేజ్ నిర్మించలేదని కేటీఆర్ విమర్శించారు. ఇప్పటికే నిర్మించిన చెక్‌డ్యామ్‌లను కూడా పేల్చివేస్తున్నారని ఆరోపించారు. వెయ్యి రోజుల పాలనలో సాగునీటి రంగంలో ప్రభుత్వం సాధించిన ప్రగతి ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. పెద్దవాగు ప్రాజెక్టు రెండుసార్లు దెబ్బతిందని, సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలడంతో సుమారు రూ.100 కోట్ల నష్టం జరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని, ఇప్పటివరకు మృతదేహాలను వెలికితీయలేని పరిస్థితి ఉందని అన్నారు. వట్టెం పంప్‌హౌస్ మునిగిపోయిందని, చెక్‌డ్యామ్‌లు దెబ్బతింటున్నాయని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగిన సమయంలో పెద్ద ఎత్తున హడావుడి చేసిన బీజేపీ.. ఇతర సాగునీటి ప్రాజెక్టుల్లో సమస్యలు ఎదురైనప్పుడు ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. పెద్దవాగు, సుంకిశాల, ఎస్‌ఎల్‌బీసీ, వట్టెం వంటి ప్రాజెక్టుల విషయంలో కేంద్ర సంస్థలు ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని నిలదీశారు.

తెలంగాణకు రావాల్సిన నీటి విషయంలో ప్రభుత్వం రాజీ పడుతోందని కేటీఆర్ ఆరోపించారు. గోదావరి, కృష్ణా జలాలను ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు ప్రభుత్వం సహకరిస్తోందని విమర్శించారు. బనకచర్ల, పోతిరెడ్డిపాడు అంశాలను ప్రస్తావిస్తూ.. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు గట్టిగా మాట్లాడటం లేదని ప్రశ్నించారు. జీఆర్‌ఎంబీ, కేఆర్‌ఎంబీ సమావేశాల్లో తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం తన వాదనను బలంగా వినిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనుమతులు తీసుకొచ్చిన ఏడు ప్రాజెక్టులను రద్దు చేయాలని ప్రతిపాదనలు వచ్చినప్పటికీ ప్రభుత్వం కనీసం స్పందించలేదని ఆరోపించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ప్రయోజనాల కంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి సాగునీటి రంగంలో ఆర్.విద్యాసాగర్ రావు వంటి నిపుణులు సలహాలు ఇచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు. ప్రస్తుతం తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా గతంలో లేఖలు రాసిన అధికారులను సలహాదారులుగా నియమిస్తే రాష్ట్రానికి న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. తెలంగాణకు సాగునీటి రంగంలో భవిష్యత్తులో న్యాయం జరగాలంటే ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో సాగునీటి రంగం తీవ్రంగా నష్టపోయిందని ఆరోపిస్తూ.. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.