టి.పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర, సభలపై రేవంత్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందేకాగా.. వాటిపై స్పందించిన డీకే అరుణ.. జోగులాంబ సాక్షిగా ప్రమాణం చేద్దామా? అమ్మవారి ఎదుట బండి సంజయ్ పై చేసిన ఆరోపణలు నిరూపిస్తావా? అని చాలెంజ్ చేశారు. పాదయాత్రకు వస్తున్న స్పందనను చూసి పిచ్చి ప్రేలాపనలు చేస్తారా? అని మండిపడ్డ ఆమె.. టీఆర్ఎస్ – కాంగ్రెస్ రెండూ ఒక్కటే.. వాళ్లిద్దరు కుమక్కై మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేయబోతున్నారని.. అందుకే పీకే సాక్షిగా టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య లోపాయికారీ ఒప్పందం చేసుకుంటున్నాయని.. బీజేపీని ఒంటరిగా ఎదుర్కొనే దమ్ములేక ఈ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
Read Also: Police : మరోసారి ఖాకీ యూనిఫామ్ లో పవన్
బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతున్నారు.. యాత్రకు వస్తున్న విశేష స్పందన చూసి ఓర్వలేని టీఆర్ఎస్ నేతలు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని విమర్శించారు డీకే అరుణ.. రాళ్లు విసిరి, అలజడి సృష్టించి పాదయాత్రను ఆపాలనుకున్న టీఆర్ఎస్ నాయకులు.. యాత్రకు వస్తున్న స్పందనను చూశాక దిక్కుతోచక అడ్డగోలుగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.. వాళ్లు వాడుతున్న భాష, పద్ధతిని చూసి జనం ఛీదరించుకుంటున్నారన్న ఆమె.. మంత్రి కేటీఆర్ వాడుతున్న భాష జుగుప్పాకరం… ఎడమ కాలి చెప్పుతో పదవిని తన్నేస్తానని కేటీఆర్ చెబుతున్నారు.. ఆ పదవి కోసమే మీరు అడ్డమైన గడ్డి తింటోంది అని సెటైర్లు వేశారు.. వేలాది కోట్లు దోచుకుని ఓట్లను కొనాలనుకుంటున్నది ఎందుకు? అని నిలదీశారు.. ఇక, బీజేపీకి భయపడే టీఆర్ఎస్ పార్టీ.. పీకే ను తెచ్చుకుంది. ప్రజలు టీఆర్ఎస్ ను నమ్మడం లేదని గ్రహించి… కొత్త మోసాలు ఏం చేయాలనే విషయంపై చర్చించడనికే పీకేను మీ అయ్య పిలిపించుకుండు కదా…? అని కేటీఆర్ను ప్రశ్నించారు.. టీఆర్ఎస్ అడుగడుగునా ప్రజావిశ్వాసం కోల్పోయింది. అందుకే మళ్లీ గెలిచేందుకు పీకే అనే కన్సల్టెన్సీని తెచ్చుకున్నాడు. పీకే కాదు కదా…. టీఆర్ఎస్ ఇంకెంతమంది కన్సల్టెన్సీలను తెచ్చుకున్నా లాభం లేదని జోస్యం చెప్పారు.
తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ను ఓడించడానికి, బీజేపీకి అధికారం అప్పగించడానికి సిద్ధమయ్యారు.. అందుకే బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా టీఆర్ఎస్ తో కుమ్కక్కై పీకేతో మంతనాలు చేస్తున్నారని ఆరోపించారు డీకే అరుణ.. రేవంత్ కు ఇంకా విశ్వాసమున్నట్లుంది కాంగ్రెస్ పైన… టీఆర్ఎస్ తో పీకేకు పొత్తు ఉండదని అంటున్నడు.. పైగా బండి సంజయ్ ను అనరాని మాటలు అంటున్నారని ఫైర్ అయ్యారు.. రేవంత్… మీరు, కేసీఆర్ కలిసి దొంగాట ఆడుతున్నారు.. మీ పార్టీలోనే కొందరు టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని గెలవాలని భావిస్తే… ఇంకొందరేమో టీఆర్ఎస్ నియంత పాలనకు అడ్డుకట్ట వేయాలనుకుని మథనపడుతున్నారని తెలిపారు. ఇక, రేవంత్ మీద అనేక ఆరోపణలున్నాయి.. కాంగ్రెసోళ్లే రేవంత్ ను బ్లాక్ మెయిలర్ అంటున్నారని తెల్వదా? అలాంటి మీరు సంజయ్ పై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సంజయ్ పై వచ్చిన ఆరోపణలను నిరూపించగలరా? జోగులాంబ అమ్మవారి ఆలయం వద్ద బండి సంజయ్ కుటుంబ సభ్యులను కూడా తీసుకొచ్చి ప్రమాణం చేయించేందుకు మేం సిద్ధం. మీరు చేయగలరా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.. రాజకీయాల్లో కేసీఆర్ లాగా సంస్కార హీనమైన వ్యాఖ్యలు చేస్తే ప్రజలు హర్షించరని హితవుపలికిన డీకే అరుణ.. హుజూరాబాద్ లో మీ పార్టీ దుస్థితి ఏ విధంగా ఉందో.. కళ్లారా ఉప ఎన్నికల ఫలితాల్లో చూశాం… గల్లీలో, ఢిల్లీలో నాయకత్వం లేదు. ఎవరు బలంగా ఉంటే వాళ్లను తొక్కాలనే స్వభావం వాళ్లదన్నారు.. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదు. ఆ పార్టీ వల్ల ఈ దేశం బాగుపడుతుందనే నమ్మకం ప్రజల్లో పోయింది. మోడీ వల్ల దేశంలో, రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమనే భావనకు వచ్చారని.. అందుకే తెలంగాణలో అట్టడుగున ఉన్నవారికి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలనే కోరుకుంటున్నారని తెలిపారు డీకే అరుణ.