Bandi Sanjay : తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై కొనసాగుతున్న ఉత్కంఠ నేపథ్యంలో, కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టతనిచ్చారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయంపై అనవసర చర్చలు, విమర్శలు అర్ధహీనమని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన, కీలక వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ ఒక కట్టర్ కేడర్తో కూడిన పార్టీ అని, రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో అధిష్ఠానం అన్ని అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు బండి సంజయ్. అధికారం కోసం కాదు, దేశం కోసం పనిచేసే పార్టీ బీజేపీ అని. ఎవరు అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలన్నది అడగొచ్చు కానీ, నిర్ణయం మాత్రం అధిష్ఠానమే తీసుకుంటుంది అని స్పష్టం చేశారు.
Srisailam: శ్రీశైలం భక్తులకు అలర్ట్.. రేపటి నుంచి ఇష్టకామేశ్వరి దేవి ఆలయ సందర్శన నిలుపుదల
సోషల్ మీడియాలో పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ తీర్పును గౌరవించకుండా, సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేయడం సహించేది కాదు. అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం అని ఆయన పేర్కొన్నారు.
ఇక, బీజేపీ బీసీలకు అధ్యక్ష పదవి ఇవ్వదని BRS చేస్తున్న ఆరోపణలను బండి సంజయ్ ఖండించారు. “గతంలో నాకు, లక్ష్మణ్గారికి రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇచ్చిన పార్టీ ఇదే బీజేపీ. BRS వాళ్లు నిజంగా బీసీలకు న్యాయం చేయాలనుకుంటే, వారే బీసీలకు తమ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలి” అని డిమాండ్ చేశారు.
“ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎవరిని సూచించారన్నది సంబంధం లేదు. బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా అది పార్టీ వ్యూహాల ప్రకారమే ఉంటుంది. ఎవరు డమ్మీలు కాదు.. ఎవరిని ఎక్కడ వినియోగించాలో పార్టీకి బాగా తెలుసు” అని స్పష్టం చేశారు.