తెలంగాణలో బీజేపీ తన అస్థిత్వం కోసం పోరాటం చేస్తోంది. 2023 టార్గెట్ గా పావులు కదుపుతోంది. వచ్చిన అవకాశాలను దేన్నీ వదలడం లేదు. సీఎం కేసీఆర్ పై పోరాటానికి దిగారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బడ్జెట్ సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మంటలు రేపుతున్నాయి, రాజ్యాంగాన్ని మార్చాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన అన్న మాటలు రాజకీయంగా వివాదాస్పదమవుతున్నాయి. అంతేకాదు ప్రధాని మోదీపై ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు దీక్షను చేపట్టబోతున్నాయి.
ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రేపు ఢిల్లీలో మౌన దీక్షను చేపట్టబోతున్నారు. బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు, కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం తదితర నేతలతో కలసి ఆయన దీక్షకు దిగుతున్నారు. ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద బీజేపీ ఎంపీలు కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపడానికి సిద్ధమవుతున్నారు. ఇదిలా వుంటే కేసీఆర్ దేశద్రోహి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్, మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదని, సీఎం కేసీఆర్ ను అని ఆయన అంటున్నారు. మరోవైపు ఎమ్మార్పీఎస్ కూడా సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై నిరసన తెలపాలని నిర్ణయించింది.