Bandi Sanjay : కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కోటి యాభై లక్షల రూపాయల సిఎస్సార్ నిధులతో కొనుగోలు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల బలోపేతంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పేద ప్రజలు అత్యవసర చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రులను విశ్వసించి వస్తారని, ఆ నమ్మకాన్ని పెంపొందించే దిశలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని బండి సంజయ్ తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ అవకాశాలను సక్రమంగా వినియోగించుకోలేకపోతుందని ఆయన విమర్శించారు.
ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేక పేదలకు నమ్మకం తగ్గిపోతున్నదని, ఈ పరిస్థితిని మార్చడానికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఇప్పటివరకు సిఎస్సార్ నిధుల ద్వారా ఐదు కోట్ల రూపాయలు అందజేసి ఆధునిక పరికరాలను తీసుకురావడంలో విజయవంతమయ్యామని చెప్పారు. ఆసుపత్రిలో పోస్టుమార్టం రూమ్, ఎక్స్–రే మిషన్తో పాటు అవసరమైన ఇతర పరికరాలను ఎంపీ నిధుల ద్వారా త్వరలోనే అందజేస్తామని హామీ ఇచ్చారు. పరికరాల లేమి పేరుతో పేద రోగులను కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేయొద్దని వైద్యులకు సూచించారు.
సేవా దృక్పథంతో పనిచేస్తే ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రులపై మంచి విశ్వాసం ఏర్పడుతుందని అన్నారు. రాష్ట్రంలోని చెక్డ్యాంల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని బండి సంజయ్ ఆరోపించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టర్ల వద్ద నుంచి కమీషన్లు తీసుకుందని, ప్రణాళిక లేకుండా చెక్డ్యాంలను నిర్మించారని పేర్కొన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్టర్లు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్నారని అన్నారు.
చెక్డ్యాంలపై విచారణ జరిపించి అవినీతి నిర్ధారణ అయితే కాంట్రాక్టర్ల నుంచి నిధులు రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. జమ్మికుంట రైల్వే స్టేషన్ను పూర్తిగా ఆధునీకరించేందుకు త్వరలో ప్రపోజల్స్ పంపుతామని, జమ్మికుంటలో స్టేడియం నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తామని బండి సంజయ్ ప్రకటించారు.