తమ పార్టీకి ఎన్నికల సంఘం 'కుండ' గుర్తు కేటాయించినట్టు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పేర్కొన్నారు. విశాఖలోని రైల్వే న్యూ కాలనీలో గల పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీకి కుండ గుర్తు కేటాయించిన ఎన్నికల సంఘం అధికారులు, హైకోర్టు న్యాయమూర్తులకు ధన్యవాదాలు తెలిపారు. కుండలు తయారు చేసే కుమ్మరి మాదిరిగానే తాను కూడా ప్రజలు జీవితాలు తీర్చి దిద్దుతామన్నారు.
గుంటూరు జిల్లాలోని ఏటుకురులో నిర్వహిస్తున్న మేమంత సిద్ధం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ జన సముద్రాన్ని చూస్తే మరో ప్రపంచం కనిపిస్తుందన్నారు. ఈ జన ప్రభంజనం చరిత్రలో నిలిచిపోతుంది.. ప్రతి ఇంటి చరిత్రను కొత్త బంగారు లోకానికి తీసుకెళ్తుంది.. మన ప్రభుత్వానికి మద్దతుగా జరుగుతున్న మంచిని కాపాడుకునేందుకు మంచినీ కొనసాగించేందుకు వైసీపీకి మద్దతు పలికిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు.
కడప జిల్లాలోని పులివెందులలో వైసిపి బలిజ సంఘీయుల ఆత్మీయ సమావేశంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేనేంటో నా మనస్తత్వం ఏంటో ఇక్కడ ప్రజలకు తెలుసు అని పేర్కొన్నారు. గడిచిన మూడేళ్లుగా ఇబ్బంది పెట్టాలని చూస్తూనే ఉన్నారు.. అయినా చెక్కు చెదరని ఆత్మ విశ్వాసంతో ప్రజలతోనే ఉన్నాను అని ఆయన చెప్పారు.
వైసీపీ పార్టీలో ఇపుడున్న విధానం సక్సెస్ ఫుల్ మోడల్.. మళ్ళీ మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది అని మంత్రి ధర్మాన ప్రసాదరావు జోస్యం చెప్పారు. వాలంటీర్లను రిజైన్ చేయమనoడి.. వారితో పని చేయించండి అని పేర్కొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఆయన ఈ నెల 25వ తేదీన పులివెందులలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల భేటీ ముగిసింది. సుమారు రెండు గంటల సేపు సాగిన ఎన్డీఏ కూటమి నేతల సమావేశం.. ఎన్నికల కోడ్ వచ్చినా మారని కొందరి అధికారుల పని తీరు మీదే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఎన్డీఏ కూటమి నేతల భేటీలో ఒకట్రొండు స్థానాల్లో మార్పు చేర్పులపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. అనపర్తి, ఉండి, తంబళ్లపల్లె, లాంటి స్థానాల్లో మార్పు చేర్పులపై ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తుంది.
ఈ పొత్తు సహితం కాదని కొంతమంది పనికిమాలిన మంత్రులు మాట్లాడడం హాస్యాస్పదంగా భావిస్తున్నామని గన్నవరం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గన్నవరం టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా గిద్దలూరు, కందుకూరు టీడీపీలో అసమ్మతి కొనసాగుతుంది. ఆ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు టీడీపీ రెబల్స్ రెడీ అవుతున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్దిగా ముత్తుముల అశోక్ రెడ్డిని తెలుగు దేశం పార్టీ అధిష్టానం ప్రకటించింది.