ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన విమానాశ్రయాలు ప్రయాణికులతో కళకళలాడుతున్నాయి. గత ఆరు నెలలుగా రాష్ట్రంలోని అన్ని ఎయిర్పోర్టుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది విజయవాడ విమానాశ్రయం మిలియన్ మార్క్ను అందుకుంది. ఇంకా రెండు నెలలు ఉండటంతో ఈ సంఖ్యలో మరో మూడు లక్షల మంది పెరిగే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. మరో వైపు ప్రయాణికుల రద్దీని పరిశీలిస్తే, విజయవాడ ఎయిర్పోర్ట్ ఈసారి ఆల్ టైం రికార్డు నమోదు చేసే అవకాశం ఉంది.
ఎమ్మెల్సీ ఎన్నికలపై కూటమి ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో ఇంఛార్జి మంత్రులతో రేపు కూటమి నేతల సమావేశం జరగనుంది. ఆయా జిల్లాలో ఉన్న కూటమి నేతలైన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో ఇంఛార్జి మంత్రులు సమావేశమవుతారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలపై చర్చ జరగనుంది.
కేంద్ర బడ్జెట్పై ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ అలెర్ట్ అయ్యింది.. బడ్జెట్ లో రాష్ట్రానికి వస్తున్న ప్రయోజనాలు.. నిధులకు సంబంధించి మద్యాహ్నం 3 గంటలలోగా నివేదిక ఇవ్వాలని అన్నిశాఖలకు ఆర్ధికశాఖ సూచనలు చేసింది.. అన్ని శాఖల నుంచి సమాచారం వచ్చిన తర్వాత.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నివేదిక ఇవ్వనుంది ఆర్థిక శాఖ.
గూగుల్ మ్యాప్ను నమ్ముకుని కొండల్లోకి లోడ్తో ఉన్న కంటైనర్తో వెళ్లిపోయాడు ఓ డ్రైవర్.. కర్ణాటక రాష్ట్రం నుండి తాడిపత్రికి ఐరన్ లోడుతో బయలుదేరింది కంటైనర్.. అయితే, రాత్రి సమయంలో దారి తెలియక గూగుల్ మ్యాప్ని ఆన్ చేశాడు డ్రైవర్ ఫరూక్.. ఇక, ఆ మ్యాప్ను ఫాలో అయిపోయాడు.. అది సరాసరి యాడికి మండలంలోని రామన్న గుడిసెల వద్ద కొండల్లోకి తీసుకెళ్లింది.. తీరా.. అక్కడికి వెళ్లిన తర్వాత లోయలోకి ఒరిగిపోయింది ఆ భారీ కంటైనర్..
జగ్గయ్యపేటకు చెందిన చిట్టూరి భార్గవ్ ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాడు.. ఐర్లాండ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందటం స్థానికంగా విషాదాన్ని నింపింది. జగ్గయ్యపేట పట్టణానికి చెందిన భార్గవ్.. శుక్రవారం రాత్రి స్నేహితులతో కలిసి బయటికి వెళ్తుండగా.. చెట్టును ఢీకొట్టింది కారు.. ఈ ప్రమాదంలో భార్గవ్ మృతి చెందాడు..
ఏపీలో ఇవాళ్టి నుంచి పెరిగిన భూముల రిజిస్ట్రేషన్ ధరలు అమల్లోకి రానున్నాయి. జనవరి 31వరకే ప్రస్తుత ధరలు ఉండగా.. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి కనీసం 20 శాతం పెరుగనున్నాయి. దీంతో తక్కువ ధరలతో జరిగిన క్రయవిక్రయాలను రిజిస్టర్ చేసుకోవడానికి నిన్నటి వరకు క్లయింట్లు రిజిస్ట్రేషన్ ఆఫీసులకు క్యూ కట్టారు.
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు జిల్లాల పర్యటన కొనసాగుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇవాళ అన్నమయ్య జిల్లాకు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. రాయచోటి నియోజకవర్గంలోని సంబేపల్లి మండలంలో జరిగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.