మహిళల ప్రపంచకప్లో టీమిండియా పరిస్థితి డోలాయమాన స్థితిలో ఉంది. ఈ మెగా టోర్నీలో టీమిండియా సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే మంగళవారం నాటి బంగ్లాదేశ్తో మ్యాచ్లో తప్పక గెలవాలి. అంతేకాకుండా ఈనెల 27న జరిగే దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్లోనూ విజయం సాధించాలి. అప్పుడే భారత్ ప్రపంచకప్లో సెమీస్ చేరేందుకు అవకాశం ఉంటుంది. టీమిండియా సమస్య ఏంటంటే.. బ్యాటర్లు రాణిస్తున్నప్పటికీ బౌలర్లు మాత్రం పూర్తి స్థాయిలో రాణించడం లేదు. కాబట్టి విజయాల బాట పట్టాలంటే బౌలర్లు తమ బంతులకు పదును పెట్టాల్సిందే.
అయితే ఈ టోర్నీలో ఇప్పటివరకు టీమిండియా ఐదు మ్యాచ్లు ఆడగా.. పాకిస్థాన్, వెస్టిండీస్ జట్లపై మాత్రమే గెలిచింది. ఆతిథ్య న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల చేతిలో ఓడిపోయింది. కాగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత జట్టు ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగింది. మేఘనా సింగ్ స్థానంలో పూనమ్ యాదవ్ తిరిగి జట్టులోకి వచ్చింది. బంగ్లాదేశ్ జట్టులో మాత్రం రెండు మార్పులు జరిగాయి. ముర్షిదా ఖాతూన్, లతా మండల్ జట్టులోకి వచ్చారు.