Off The Record: తెలంగాణలో… పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలని డిసైడైందట బీఆర్ఎస్. అందుకోసం ఏం చేయాలా అని తెగ ఆలోచిస్తున్న టైంలో వెదకబోయిన తీగ కాలికి తగిలిందని పార్టీ పెద్దలు సంబరపడుతున్నట్టు తెలుస్తోంది. రైతు రుణమాఫీ గులాబీ పార్టీకి ఆశాజ్యోతిలా కనిపిస్తోందని అంటున్నారు. అందేటీ… రుణమాఫీ చేసింది కాంగ్రెస్ సర్కార్ కదా…. అది బీఆర్ఎస్కు ఎలా ఊతం అవుతుందన్న డౌట్ రావడం కామన్. కానీ అసలు కిటుకు అక్కడే ఉందంటున్నాయి తెలంగాణ భవన్ వర్గాలు. రాష్ట్ర సాధన సమయంలో బీఆర్ఎస్ ఏ మీటింగ్ పెట్టినా… లక్ష్యం ఒక్కటే ఉండేది. జనం కూడా కన్విన్స్ అయ్యేవాళ్ళు. కానీ.. పదేళ్ళ అధికారం తర్వాత పార్టీ రీతి మారిపోయిందన్న వాదన ఉంది పొలిటికల్ సర్కిల్స్లో. అందుకే మంచి కాజ్ కోసం ఎదురు చూస్తున్న టైంలో రుణమాఫీ అంశం దొరికిందని అంటున్నారు.
ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగా రెండు లక్షల రూపాయల లోపు రైతు రుణాల్ని మాఫీ చేసింది కాంగ్రెస్ సర్కార్. అయితే… ఆ ఫలం అర్హులైన రైతులు అందరికీ అందలేదన్నది బీఆర్ఎస్ పాయింట్. ఇప్పుడు ఇదే అంశాన్ని పట్టుకుని జనంలోకి వెళ్ళే ప్రయత్నంలో ఉంది ప్రతిపక్ష పార్టీ. గ్రామాల వారీగా… అర్హత ఉండి, మాఫీ జరగని రైతుల వివరాలు సేకరించి ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీయాలని అనుకుంటోందట. ముందు చెప్పినట్టుగా అర్హత ఉన్న ప్రతి రైతుకూ రుణమాఫీ జరిగేలా వత్తిడి తీసుకువస్తే పోగొట్టుకున్న చోటే తిరిగి పుంజుకోవచ్చన్నది పార్టీ ప్లాన్గా తెలిసింది. గత ఎన్నికల్లో గ్రామీణ తెలంగాణలో దారుణంగా దెబ్బతింది కారు పార్టీ. సహజంగానే ఇక్కడ రైతులు ఎక్కువ ఉంటారు కాబట్టి రుణమాఫీ ఉద్యమం ద్వారా వాళ్ళని తిరిగి తమవైపునకు మళ్ళించుకోవాలన్నది బీఆర్ఎస్ అధిష్టానం ప్లాన్గా తెలిసింది. దాని ద్వారా.. ఇచ్చిన హామీని కాంగ్రెస్ సర్కార్ నిలబెట్టుకోలేకపోతే… రైతుల తరపున తామే పోరాడి ఇప్పించామన్న ఇమేజ్ తెచ్చుకోవాలన్న ప్లాన్ ఉందట. అందుకే గ్రామాల వారీగా రుణమాఫీ అవ్వని రైతుల డేటాను పార్టీ తరపున సేకరించే పని ముమ్మరంగా జరుగుతోందట.
తర్వాత మాఫీ అవ్వని రైతులందర్నీ ఏకం చేసేపని మొదలవబోతున్నట్టు తెలిసింది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు తాము జనాల్లోకి వెళ్ళడానికి ఒక అంశం దొరికింది. అదే సమయంలో దూరమైన గ్రామీణ ఓటర్లను త్వరగా చేరుకోవడానికి లైన్ క్లియర్ అయిందన్న చర్చ జరుగుతోంది గులాబీ పార్టీలో. రుణమాఫీ అవ్వని రైతుల తరపున పోరాటం చేస్తే.. వాళ్ళకు దగ్గర అవడంతో పాటు తమకు పొలిటికల్ గ్రౌండ్లో ప్లేస్ దొరుకుతుందన్నది బీఆర్ఎస్ స్కెచ్గా తెలుస్తోంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ఇతర ఆందోళన కార్యక్రమాలు నిర్వహించబోతున్నారట.అయితే… ఇదే సమయంలో పార్టీలోనే ఇంకో వాయిస్ వినిపిస్తోందని అంటున్నారు. రుణమాఫీ విషయంలో అప్పుడే తొందరపడటం ఎందుకు? కొన్నాళ్ళు ఆగితేనే మంచిదని అంటోందట ఆ వర్గం. ఒకే ఊళ్ళో కొందరికి మాఫీ అయి మరి కొందరికి అవకుంటే… అటోమేటిగ్గా రైతుల్లోనే వ్యతిరేకత మొదలవుతుందని, అలాంటప్పుడు ఆ అగ్గికి ఆజ్యం పోస్తే తేలిగ్గా వర్కౌట్ అవుతుందిగానీ… ఇప్పటి నుంచే మనం ఇంతలా చించుకోవడం ఎందుకన్నది కొందరు సీనియర్స్ అభిప్రాయంగా తెలుస్తోంది. కానీ… బీఆర్ఎస్లోనే మరో వర్గం అభిప్రాయం మాత్రం దొరికిన ఛాన్స్ని వదులుకోవద్దన్నట్టుగా ఉందంటున్నారు. మొత్తంగా రైతు రుణమాఫీనైతే ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా… తాము తిరిగి పుంజుకునే ఆయుధంగా వాడుకోవాలన్నది బీఆర్ఎస్ ప్లాన్ అట.