శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. టికెట్ల కోటా పెంపు
ప్రముఖ పుణ్యక్షేత్రం, కొలిచినవారి కొంగుబంగారం తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పరితపిస్తుంటారు. ఇక, త్వరలోనే వేసవి సెలవులు రానుండడంతో.. తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడే పరిస్థితి లేకపోలేదు.. మరోవైపు.. ఎన్నికల కోడ్ నేపథ్యంలో.. సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం.. అయితే, శ్రీవారి భక్తులకు శుభవార్త చెబుతూ.. శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను పెంచింది టీటీడీ.. ఎన్నికల కోడ్ నేఫథ్యంలో సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసిన నేపథ్యంలో.. భక్తుల సౌకర్యర్దం ఆఫ్ లైన్ విధానంలో కేటాయించే శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను పెంచినట్టు టీటీడీ ప్రకటించింది.. అయితే, ఇవి ఆఫ్లైన్కే పరిమితం.. ఆన్లైన్లో అందుబాటులో ఉండవు. ఇక, రేపటి నుంచి ఆన్ లైన్ లో జూన్ నెలకు సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ.. మరోవైపు.. ఎల్లుండి నుంచి అంటే ఈ నెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు నిర్వహించనున్నారు.. ఈ నేపథ్యంలో ఐదు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో సహస్రదీపాలంకరణ సేవను రద్దు చేసినట్టు టీటీడీ ప్రకటించింది..
సమష్టిగా కలిసి పని చేద్దాం.. ఏపీని తిరిగి గాడిలో పెడదాం..
పల్నాడు జిల్లాలో బీజేపీ-టీడీపీ-జనసేన ఉమ్మడిగా నిర్వహించిన ప్రజాగళం సభ విజయవంతమైంది.. ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్లు ఈ బహిరంగ సభ వేదికగా కీలక ఉపనస్యాలు చేసిన విషయం విదితమే కాగా.. ఇక, ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఏపీ వాసులకు పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు.. సమష్టిగా ఏపీని తిరిగి గాడిలో పెట్టేందుకు కలిసి పని చేద్దాం అన్నారు.. ప్రజాగళానికి కదిలి వచ్చిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.. ప్రజా మద్దతుతో వారి హక్కుల కోసం పోరాడి, రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తును ఇవ్వాలనే సంకల్పం మరింత బలపడిందన్నారు.. కలిసికట్టుగా మనం విజయం సాధిస్తున్నాం అనే ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు..
విశాఖ దక్షిణ నియోజకవర్గం.. జనసేనలో సీటు ఫైట్..!
ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.. ఇంకా ఏపీలో కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించలేదు.. ఇంకా కొన్ని చోట్ల అసలు టికెట్ ఎవరికి అనేది ఉత్కంఠగా మారింది.. ఇక, విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ సీటు విషయంలోనూ జనసేన పార్టీలో ఫైట్ నడుస్తోంది.. ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ కి విశాఖ దక్షిణ సీటు ఖరారు అవ్వడంతో ఆశావహుల్లో అసంతృప్తి మొదలైంది.. అయితే, జనసేన పార్టీ ఎక్కడా.. అధికారికంగా వంశీ అభ్యర్థిత్వం ఖరారు చేయలేదు… కానీ, గతంలో 50 వేల ఓట్లు తేడాతో ఓడిపోయిన వంశీకి సీటు ఎలా ఇస్తారో చెప్పాలని పార్టీ నేతలను నిలదీసేవారు లేకపోలేదు.. విశాఖ చరిత్రలో వంశీ అంత ఘోరంగా ఓడిపోయిన నేత మరొకరు లేరని విమర్శించారు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)కు చెందిన కొర్పొరేటర్ సాదిక్.. వంశీకి సీటు ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని (వైసీపీ) అఖండ మెజార్టీతో విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు సాదిక్.
పిఠాపురం పర్యటనకు పవన్ కల్యాణ్..
ఈ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆ ప్రకటన తర్వాత తొలిసారి పిఠాపురం పర్యటనకు సిద్ధం అవుతున్నారు.. వచ్చే వారంలో పిఠాపురంలో పవన్ పర్యటిస్తారని జనసేన శ్రేణులు చెబుతున్నాయి.. నియోజకవర్గానికి చెందిన మూడు మండలాలు, రెండు మున్సిపాలిటీలకు చెంఇన పార్టీ నేతలు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం కానున్నారట పవన్.. పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి పవన్ కల్యాణ్ వస్తుండడంతో.. అంతా ఆసక్తికరంగా మారింది. ఇక, పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటనలో ఇతర పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలతో పెద్దసంఖ్యలో జనసేన పార్టీలో చేరతారని తెలుస్తోంది.. మరోవైపు.. సమావేశంలో కేవలం నియోజకవర్గానికి చెందిన పార్టీ క్యాడర్ మాత్రమే పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారట.. నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, పెండింగ్ లో ఉన్న పనులుపై దృష్టి సారించనున్న పవన్ కల్యాణ్.. వాటిపై ప్రత్యేకంగా చర్చిస్తారని తెలుస్తోంది. ఇక, గ్రామాల వారీగా ప్రచారంపై దృష్టి పెట్టాలని స్థానిక నాయకత్వానికి ఇప్పటికే సూచనలు వచ్చాయట.. మొత్తంగా పవన్ కల్యాన్ తొలి పర్యటనలో కేవలం జనసేన నేతలతో సమావేశాలకే పరిమితం కానున్నారు.. ఆ తర్వాత పర్యటనలో కూటమిలోని మూడు పార్టీలు (జనసేన, టీడీపీ, బీజేపీ)నేతలు, కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారట పవన్ కల్యాణ్.
ఇప్పుడు అధికారంలో ఉన్నాం.. రేపు కూడా రాబోతున్నాం
మనం ఇప్పుడు అధికారంలో ఉన్నాం.. రేపు కూడా అధికారంలోకి రాబోతున్నాం అని విశ్వాసం వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రతి నియోజకవర్గంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, కలిసిమెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు.. అయితే, ముఖ్యమంత్రి కావాలంటే ఎమ్మెల్యేల సంఖ్యాబలం కావాలి.. కావున అందరూ కష్టపడి పనిచేయాలి.. వైసీపీ అభ్యర్థులు అంతా విజయం సాధించేలా పనిచేయాలని కోరారు.. మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి, మళ్లీ ఓటు అడిగే విధంగా సీఎం వైఎస్ జగన్ చేశారు. ఇప్పుడు అభ్యర్థులు ఖారారయ్యారు కాబట్టి.. అందరినీ కలుపుకొని నేతలు ముందుకు పోవాలని సూచించారు.. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. మరలా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి.. ఈ బాధ్యత మన అందరిపై ఉందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
చంద్రబాబు పొత్తులు లేకుండా ఎప్పుడూ గెలవలేదు.. ఇప్పుడు పొత్తులు ఉన్నా సాధ్యంకాదు..!
టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి.. ఈ రోజు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై సెటైర్లు వేశారు.. చంద్రబాబు పొత్తులు లేకుండా ఎప్పుడు విజయం సాధించలేదన్న ఆయన.. కానీ, ఈ సారి పొత్తులు పెట్టుకున్నా చంద్రబాబు విజయం సాధించలేరని జోస్యం చెప్పారు.. ఇక, ముఖ్యమంత్రి కావాలనుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఎమ్మేల్యే అయితే చాలు అన్నట్లుగా పోటీ చేస్తున్నాడు అంటూ ఎద్దేవా చేశారు. మరోవైపు.. బీజేపీకి రాష్ర్టంలో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దోరకని పరిస్థితి ఉందన్నారు.. మూడు ప్రధాని నరేంద్ర మోడీ చేసిన విమర్శలపై స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీకి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధమే లేదన్నారు.. కాంగ్రెస్ పార్టీని గద్దే దింపడానికి ఆవిర్భవించేందే వైసీపీ అన్నారు ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి.
ప్రధాని సభలో మైకులు పనిచేయలేదు.. పరిస్థితులు, దేవుడు వారి పక్షాన లేడు..!
చిలకలూరిపేటలో జరిగిన టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి బహిరంగసభపై సెటైర్లు వేశారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్.. నిన్న సభలో చంద్రబాబు ప్రత్యేక హోదాను ఎందుకు అడగలేదు ? అని ప్రశ్నించిన ఆయన.. నిన్న చిలకలూరిపేటలో జరిగిన సభ ఫ్లాప్ అయ్యిందన్నారు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభలో మైకులు పనిచేయలేదు.. అంటే.. పరిస్థితులు, దేవుడు వారి పక్షాన లేడని వ్యాఖ్యానించారు. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది బీజేపీ అని దుయ్యబట్టారు.. టీడీపీ, బీజేపీ, జనసేన కలయిక అక్రమ కలయికగా మండిపడ్డారు.. గతంలో చంద్రబాబు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చాలా అనరాని మాటలు అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్లు కలిసి రాష్ట్రాన్ని నరేంద్ర మోడీకి తాకట్టు పెట్టాలనుకుంటున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? అని ప్రశ్నించారు ఎంపీ మార్గాని.. విలువలు విశ్వసనీయత అనే పదాలు చంద్రబాబు జీవితంలో తెలుసుకోలేరన్న ఆయన.. పవన్ కల్యాణ్, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఆలోచించే వ్యక్తులు కాదన్నారు. పార్లమెంట్లో పాస్ అయిన బిల్లులకు కూడా ఈ రోజుకి అతిగతి లేదన్నారు. విభజన హామీలను ఇంకా అమలు చేయలేదన్నారు. మోసం చేయడం అనేది చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యగా విమర్శించారు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి పెద్ద కొడుకు లాగా వ్యవహరిస్తున్నారు.. రాజమండ్రిలో గంజాయి బ్యాచ్ కి డాన్ ఆదిరెడ్డి శ్రీనివాస్ అని ఆరోపించారు. అధిక వడ్డీలతో పేదవాళ్లు స్థలాలు లాక్కున్న చరిత్ర ఆదిరెడ్డి కుటుంబానిదని దుయ్యబట్టారు.. నా గురించి మాట్లాడే అర్హత నీకు లేదన్నారు. రాజమండ్రిలో గంజాయి బ్లేడు బ్యాచ్లు నడుస్తున్నరాయంటే.. దానికి కారణం ఆదిరెడ్డి కుటుంబమే నంటూ సంచలన ఆరోపణలు చేశారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్.
మాకు అధికారం కంటే ప్రజా సంక్షేమం ముఖ్యం..
మాకు అధికారం కంటే ప్రజా సంక్షేమం ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. జగిత్యాలలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘మే 13న తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. తెలంగాణ ప్రజలు వికాసిత్ భారత్కు ఓటు వేయబోతున్నారు. తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోంది. మల్కాజిగిరిలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తెలంగాణ ప్రజలు అబ్ కీ బార్ అంటున్నారు.. 400 పార్. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ నిన్న విడుదలైంది. గడిచిన మూడు రోజుల్లో తెలంగాణకు రెండు సార్లు వచ్చాను. దేశంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం. భారతదేశం అభివృద్ధి చెందితే తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుంది. బీఆర్ఎస్పై ప్రజల ఆగ్రహం అసెంబ్లీ ఎన్నికల్లో బయటపడింది. తెలంగాణను దోచుకున్న వారిని వదిలిపెట్టం. మాకు అధికారం కంటే ప్రజా సంక్షేమమే ముఖ్యం.
సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చింది మోడీనే..!
సమ్మక్క సారక్క పేరుతో ట్రైబల్ యూనివర్సిటీని ఇచ్చింది మోదీనే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. గత పదేళ్ల నరేంద్రమోదీ పాలనలో దేశంలో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ఈ పదేళ్ళలో తెలంగాణకు 10 లక్షల కోట్ల రూపాయల నిధులు వచ్చాయన్నారు. సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చారని క్లారిటీ ఇచ్చారు. జాతీయ రహదారులు, పేదలకు ,బియ్యం, పిఎం కిసాన్ లాంటి ఎన్నో కార్యక్రమాలు అమలు చేశారన్నారు. ఈ పదేళ్ళలోనే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అత్యంత అవినీతి మయ పాలన చేసిందన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు, గొర్రెల పంపిణీ ఏ పథకాలు చూసిన అవినీతే అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో చాలదన్నట్టు ఢిల్లీకి వెళ్లి తెలంగాణ ప్రజలు తలదించుకునేలా లిక్కర్ స్కామ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సత్యేందర్ జైన్కు బెయిల్ తిరస్కరణ.. వెంటనే లొంగిపోవాలని సుప్రీం ఆదేశం
మనీలాండరింగ్ కేసులో ఆప్ నేత సత్యేందర్ జైన్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. మధ్యంతర బెయిల్పై ఉన్న జైన్ను వెంటనే లొంగిపోవాలని న్యాయమూర్తులు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిథాల్లతో కూడిన ధర్మాసనం కోరింది. వారం రోజుల్లోగా లొంగిపోయేందుకు అనుమతించాలంటూ జైన్ తరపు న్యాయవాది చేసిన మౌఖిక అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. జనవరి 17న, ఆయన రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. వైద్య కారణాలపై 2023 మే 26న జైన్కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన అత్యున్నత న్యాయస్థానం దానిని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వచ్చింది. ఈ కేసులో తన రెగ్యులర్ బెయిల్ దరఖాస్తును కొట్టివేస్తూ ఏప్రిల్ 6, 2023న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ జైన్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఎస్పీ
బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉత్తరప్రదేశ్లోని మరో నాలుగు స్థానాల్లో తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఇప్పటి వరకు ఆ పార్టీ మొత్తం 13 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. బీఎస్పీ ఇప్పటి వరకు ఐదుగురు ముస్లింలు, నలుగురు బ్రాహ్మణ ముఖాలను అభ్యర్థులుగా నిలిపింది. ఇప్పుడు పార్టీ కాన్పూర్, మీరట్, అక్బర్పూర్, బాగ్పత్ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. లోక్సభ ఎన్నికలకు పశ్చిమ యుపిలోని బాగ్పత్ స్థానం నుండి ప్రవీణ్ బైన్స్లా , మీరట్ నుండి దేబబ్రత త్యాగిని బిఎస్పి తన అభ్యర్థిగా చేసింది. దీంతో పాటు అక్బర్పూర్ నుంచి రాజేష్ ద్వివేదీ, కాన్పూర్ నుంచి కుల్దీప్ బదౌరియా అభ్యర్థులుగా నిలిచారు. కాగా మాయావతి పార్టీ తన అభ్యర్థిగా ఇర్ఫాన్ సైఫీ పేరును మొదట ప్రకటించింది. అతని పేరును బీఎస్పీ పశ్చిమ యూపీ ఇన్ఛార్జ్ షంషుద్దీన్ రైనీ ప్రకటించారు. మొరాదాబాద్ స్థానం నుంచి ఇర్ఫాన్ సైఫీని బీఎస్పీ అభ్యర్థిగా నిలబెట్టింది.
ఎస్బీఐకి సుప్రీంకోర్టు చివరి గడువు.. ఎలక్టోరల్ బాండ్లపై ప్రతి రహస్యం చెప్పాల్సిందే !
ఎలక్టోరల్ బాండ్ కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై కఠినంగా వ్యవహరించింది. ఎలక్టోరల్ బాండ్ల సమాచారం ఇవ్వడానికి ఎందుకు వెనుకాడుతున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎందుకు పూర్తి నంబర్లు ఇవ్వలేదు.. ఎలక్టోరల్ బాండ్ కేసులో ఎస్బీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాండ్ నంబర్ను అందించాలని ఎస్బీఐని కోర్టు ఆదేశించింది. అలాగే, గురువారం సాయంత్రం 5 గంటలలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్బీఐని కోర్టు ఆదేశించింది. ఇకపై తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని అఫిడవిట్లో పేర్కొనాల్సి ఉంటుంది. విచారణ సందర్భంగా ఎస్బీఐ తన వద్ద ఉన్న ప్రతి సమాచారాన్ని సుప్రీం కోర్టుకు అందజేస్తానని తెలిపింది. బ్యాంక్ కూడా తన వద్ద ఎటువంటి సమాచారాన్ని దాచిపెట్టలేదని తెలిపింది. ఈ కేసులో న్యాయవాది ప్రశాంత్ భూషణ్ రాజకీయ పార్టీలు దాతల పేర్లను వెల్లడించకపోవడాన్ని లేవనెత్తారు. దీనిపై జస్టిస్ గవాయి మాట్లాడుతూ.. మేం ఇంకా సమీక్షకు కూర్చోలేదని అన్నారు.
‘420’ లే ‘400 దాటడం’ గురించి మాట్లాడుతున్నారు: ప్రకాష్ రాజ్
లోక్సభ ఎన్నికల్లో 400కు పైగా సీట్లు వస్తాయని ఏదైనా రాజకీయ పార్టీ మాట్లాడితే అది అహంకారమే అని నటుడు ప్రకాష్ రాజ్ చిక్కమగళూరులో అన్నారు. 420 (మోసం) చేసిన వారే వచ్చే లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామని మాట్లాడుతున్నారని ప్రకాష్ రాజ్ ఆదివారం బీజేపీ పేరు ప్రస్తావించకుండా అన్నారు. కర్ణాటకలోని చిక్కమగళూరు ప్రెస్క్లబ్లో ప్రకాష్రాజ్ మాట్లాడారు. 420 చేసిన వారే 400 సీట్లు తెస్తామని మాట్లాడతారని అన్నారు. అది ఏ పార్టీ అయినా సరే. అది కాంగ్రెస్ అయినా, మరే ఇతర పార్టీ అయినా. ఇది మీ అహాన్ని చూపుతుందన్నారు. 400 కంటే ఎక్కువ సీట్లతో ఎన్డిఎ తిరిగి అధికారంలోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటనపై నటుడు ప్రకాష్, ప్రజాస్వామ్యంలో ఏ ఒక్క పార్టీ 400 లేదా అంతకంటే ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఇప్పుడు లేదని అన్నారు. ప్రజారాజ్యం సీటు ఇచ్చినప్పుడే సీటు గెలవగలమని ప్రకాష్ రాజ్ అన్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా తాము ముందస్తుకు వెళ్లి సీట్లు తీసుకోగలమని చెప్పలేమన్నారు. దీనినే అహంకారం అంటారు.
సిటాడెల్ వెబ్ సిరీస్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన వరుణ్ ధావన్..
గత ఏడాది స్టార్ హీరోయిన్ సమంత నటించిన యాక్షన్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ ప్రేక్షకులను పలకరించడానికి వచ్చేస్తోంది.ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తయ్యిందని మేకర్స్ ప్రకటించారు. ఇక తాజాగా ‘సిటాడెల్’ నుండి క్రేజీ అప్డేట్ రానుందని ఇందులో హీరోగా నటిస్తున్న వరుణ్ ధావన్ బయటపెట్టారు. ఈ అప్డేట్ గురించి చెప్పడం కోసం వరుణ్.. ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.‘‘అందరికీ హలో. నేను మీ ప్రైమ్ స్నేహితుడిని. సీక్రెట్ న్యూస్ తీసుకొచ్చేశాను. 2024లోనే అతిపెద్ద అనౌన్స్మెంట్ వచ్చేస్తోంది’’ అంటూ వరుణ్ ధావన్ ఏదో చెప్పబోతుండగా.. సార్ ఇవన్నీ చెప్పకూడదు అంటూ పక్కన నుండి వాయిస్ వినిపిస్తుంది. ‘‘ఇప్పుడు చెప్పకూడదు కానీ మార్చి 19కి చెప్పొచ్చు కదా. మీరు సిద్ధమేనా..?’’ అంటూ వీడియోను ముగించాడు వరుణ్ ధావన్.
బాలయ్య ఫ్యాన్ తోనే మోక్షజ్ఞ ఎంట్రీ.. బాలయ్య ప్లాన మాములుగా లేదే..
నందమూరి నట సింహం బాలయ్య వారసుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న సంగతి తెలిసిందే.. గత కొన్ని రోజులుగా ఈ విషయం పై వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఏ డైరెక్టర్ మోక్షజ్ఞను పరిచయం చేస్తారా అని నందమూరి ఫ్యాన్స్ తో పాటు సినీ వర్గాల్లో కూడా పెద్ద చర్చ జరుగుతుంది.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. బాలయ్య ఫ్యాన్స్ తోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయం అని వార్త షికారు చేస్తుంది. అతను ఎవరో మీకు అర్థమైంది కదూ .. ఎస్ మీరు విన్నది నిజమే.. మోక్షజ్ఞని డైరెక్టర్ అనిల్ రావిపూడితో లాంఛ్ చేయిస్తారంటూ గతంలో వార్తలు వచ్చాయి. కానీ బాలయ్య మాత్రం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తోనే తన కొడుకు మొదటి సినిమాను లాంఛ్ చెయ్యాలని భావిస్తున్నారట. మోక్షజ్ఞ కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను తయారు చేస్తున్నట్లు సమాచారం. స్టోరీని స్వయంగా బాలయ్యే ఫైనల్ చేయబోతున్నారని టాక్.. తన కొడుకు మొదటి సినిమా మాస్ డైరెక్టర్ తో ఉంటె తన కెరీర్ కు ప్లస్ అవుతుందని బాలయ్య భావిస్తున్నారు. అందుకే బోయపాటిని సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ వార్త విన్న నందమూరి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కొంతమంది మాత్రం కాస్త టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే బోయపాటి ఊరమాస్ ఎఫెక్ట్లు, నరుకుడు బాలయ్యకి అయితే ఒకే కానీ మోక్షజ్ఞకు షూట్ అవుతాయా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా బోయపాటి , మోక్షజ్ఞ సినిమా అంటే ఇండస్ట్రీ షేక్ అవుతుందని అనుకుంటున్నారు.. ఈ ఏడాదిలోనే సినిమా మొదలు కాబోతుందని సమాచారం..