రామగుండంలో మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు 500 కోట్లను కేటాయించినట్టు సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. దీని నిర్మాణం పూర్తయితే ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. సోమవారం కొత్తగూడెంలో జరిగిన సింగరేణి 100వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో దీనిని ఆమోదించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సూచన మేరకు వైద్య కళాశాలకు ప్రత్యేక నిధుల మంజూరు చేశామని ఎన్.శ్రీధర్ వెల్లడించారు.
దీంతో సింగరేణి కార్మికుల 50 ఏళ్ల కల సాకారం కావడంతో పాటు సీఎం హామీ కూడా నేరవేరనుంది. రెండేళ్లలో పూర్తి స్థాయిలో నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. తెలంగాణ ప్రాంత విద్యార్థులకు వైద్య విద్య కూడా అందుబాటులోకి వస్తుందని శ్రీధర్ వెల్లడించారు. సింగరేణి ఉద్యోగులు సీఎం కేసీఆర్కు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.