Taiwan: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలో తైవాన్ అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. చైనా చాలా కాలంగా తైవాన్ను కబలించాలని చూస్తోంది. ‘‘వన్ చైనా’’ విధానంలో తైవాన్ కూడా భాగమే అని బీజింగ్ చెబుతోంది. ఈ ఉద్రిక్తతల మధ్య తైవాన్ అధ్యక్షుడు లై చింగ్-టే కీలక ప్రకటన చేశారు. ‘‘తైవాన్ బీజింగ్ ఆధీనంలో లేదు’’ అని అన్నారు. తైవాన్ స్వాతంత్య్రం అంటే తమ దేశం చైనాలో భాగం కాదని, దాని ఆధీనంలో లేమని స్పష్టం చేశారు. తైవాన్ భవిష్యత్తును వేరే దేశాలు కాకుండా, దాని ప్రజలే నిర్ణయిస్తారని లై చింగ్-టే చెప్పారు.
ట్రంప్ చైనా పర్యటన ముగిసిన తర్వాత మాట్లాడుతూ.. స్వాతంత్య్రం కోసం అమెరికాపై ఆధారపడొద్దని ఆయన అన్నారు. ఇదే కాకుండా చైనా బలమైన మిలటరీ శక్తి అని, తైవాన్ను రక్షించడానికి అమెరికా చాలా దూరంలో ఉందని చెప్పారు. ఇప్పుడు ఈ ప్రకటనే తైవాన్ ఆగ్రహానికి కారణమైంది. చైనా వైఖరిని, ట్రంప్ వ్యాఖ్యల్ని తైవాన్ అధ్యక్షుడు తప్పుపట్టారు. తమ ప్రజలు స్వాతంత్య్రంలో రాజీ పడబోరని స్పష్టం చేశారు.
1949లో, చైనాలో అంతర్యుద్ధం జరిగింది. ఓడిపోయిన ప్రభుత్వం తైవాన్కు పారిపోయింది. దీని తరువాత, చైనాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుండి, తైవాన్ తన భూభాగంలో భాగమని చైనా వాదిస్తూ వస్తోంది. చాలా సార్లు తైవాన్ చుట్టుపక్కల సముద్ర జలాల్లో చైనా మిలిటరీ విన్యాసాలు నిర్వహించింది. తైవాన్ను బెదిరించే ప్రయత్నం చేసింది. పలుమార్లు అమెరికా తైవాన్ స్వతంత్రతకు మద్దతు తెలిపింది. అయితే, ట్రంప్ తాజా వ్యాఖ్యలు తైవాన్ ప్రజల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి.
