మ్యారేజ్ బ్యూరో పేరిట చేస్తున్న అరాచకాలు విశాఖలో తాజాగా వెలుగులోకి వచ్చాయి. పెళ్లి కాని యువతులను టార్గెట్ చేసి.. మత్తు మందు ఇచ్చి ట్రాప్ చేసి అత్యాచారాలు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఈ ఘటన నాలుగోవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితులు స్పృహలో లేని సమయంలో నగ్న వీడియోలు చిత్రీకరించి.. కేటుగాళ్లు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఓ బాధితురాలు పోలీసులకి ఫిర్యాదు చేసినా న్యాయం దక్కలేదు. దాంతో సదరు బాధితురాలు మీడియాను ఆశ్రయించింది.
మ్యారేజ్ బ్యూరో, హెర్బల్ ప్రొడక్ట్స్, ర్యాపీడో పేరిట అమ్మాయిల వివరాలను ముఠా సభ్యులు సేకరిస్తున్నారు. పెళ్లి కాని యువతులను టార్గెట్ చేసి, మత్తు మందు ఇచ్చి అత్యాచారాలు చేస్తున్నారు. గర్భం దాల్చిన బాధితురాళ్లను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. గర్భం తీయించకపోతే రూ.20 వేలు సుపారీ ఇచ్చి పైకి పంపిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. కేటుగాళ్లు ఇలా గుట్టు చప్పుడు కాకుండా అమ్మాయిలకు అబార్షన్ చేయిస్తున్నారు.
సుమారు 30 మంది బాధితరాళ్ల నగ్న వీడియోలు చిత్రీకరించి.. డబ్బు కోసం వారిని ముఠా సభ్యులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో.. చివరకి ఓ బాధితురాలు మీడియాను ఆశ్రయించింది. దాంతో మ్యారేజ్ బ్యూరో ముసుగులో చేస్తున్న అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులను కఠినంగా శిక్షించి బాధితులను ముఠా బారి నుండి రక్షించాలని బాధిత యువతి కోరింది. మరి ఇప్పటికైనా పోలీసులు స్పందిస్తారా?, ఫిర్యాదు తీసుకోని పోలీసులపై కఠిన చర్యలు ఉంటాయా? అనేది చూడాలి.