Karnataka High Court: కర్ణాటక హైకోర్టులో ట్విట్టర్ సంస్థకు షాక్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ట్విట్టర్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. 2021 ఫిబ్రవరి నుంచి 2022 మధ్య కేంద్ర ప్రభుత్వం పదిసార్లు ట్విట్టర్ను బ్లాక్ చేయాలని ఆదేశించినట్లు ట్విట్టర్ తన పిటిషన్లో పేర్కొంది. మరో 39 యూఆర్ఎల్స్ను కూడా తీసివేయాలని కేంద్ర ఐటీశాఖ ఆదేశించింది. కొన్ని ఖాతాలను నిలిపివేయాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ ట్విట్టర్ దాఖలు చేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం కొట్టివేసింది. ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా సోషల్ మీడియా సంస్థ కోర్టును ఆశ్రయించిందని న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ దీక్షిత్ అన్నారు.
ఇందుకు ట్విట్టర్పై రూ. 50 లక్షలు విధించారు. 45 రోజుల్లోగా కర్ణాటక లీగల్ సెల్ సర్వీసెస్కు ఈ మొత్తం చెల్లించాలని కోర్టు ట్విట్టర్ను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఎటువంటి వివరణను ట్విట్టర్ సంస్థ ఇవ్వలేదని న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ దీక్షిత్ తెలిపారు. ట్విట్టర్ సంస్థ ఓ రైతు కాదు, ఓ సాధారణ వ్యక్తి కాదు అని, దానికి చట్టం తెలియదన్న విషయం కాదు అని, అదో బిలియనీర్ కంపెనీ అని కోర్టు పేర్కొంది. తీర్పులో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను కోర్టు సమర్థించింది. ట్వీట్లను, అకౌంట్లను బ్లాక్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు జస్టిస్ కృష్ణ దీక్షిత్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, 21 ప్రకారం భారత పౌరులకు లభించే భావప్రకటనా స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులను ఓ విదేశీ కంపెనీ అయిన ట్విట్టర్ క్లెయిమ్ చేయలేదని కోర్టు సూచించింది.