Janasena: హైదరాబాద్లో నిర్వహించాలనుకున్న జనసేన పార్టీ ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ’కు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించడంపై జనసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సభకు అనుమతి ఇవ్వకపోవడానికి పోలీసులు చూపిన కారణాలు సమంజసంగా లేవని, అవి కేవలం సాకుల్లా కనిపిస్తున్నాయని పార్టీ నేతలు విమర్శించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు పేర్కొనడాన్ని జనసేన ప్రశ్నించింది. ఒక రాజకీయ విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలు, వాటికి ఇచ్చిన సమాధానాలు ఎలా లా అండ్ ఆర్డర్ సమస్యగా మారతాయని పార్టీ నేతలు ప్రశ్నించారు. అసలు ప్రాంతీయ భావోద్వేగాలను చర్చలోకి తీసుకువచ్చింది ఎవరో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, సభ నిర్వహించాలనుకున్న జనసేనపై మాత్రమే ఆంక్షలు విధించడం సరైన పద్ధతి కాదని పార్టీ అభిప్రాయపడింది. కొంతమంది ఉద్దేశపూర్వకంగా సెలెక్టివ్ నేరేటివ్స్, హాఫ్ కట్ వీడియోలను ప్రచారం చేస్తూ ముందుగానే సభను అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించింది. అలాగే, కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ విరాళం అందించినప్పుడు ప్రాంతీయత గుర్తుకు రాలేదా అని పార్టీ ప్రశ్నించింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సభ నిర్వహించాలనుకున్నప్పుడు మాత్రమే ప్రాంతీయ భావోద్వేగాల అంశాన్ని ముందుకు తీసుకురావడం వెనుక ఉద్దేశం ఏమిటని నిలదీసింది.
