కమాండ్ కంట్రోల్ సెంటర్లో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈనెలాఖరు లోగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. హైదరాబాద్ నగరంలోని హౌసింగ్ బోర్డుతో జాయింట్ వెంచర్గా ఉన్న ప్రాజెక్టుల్లోని సమస్యలను త్వరగా పరిష్కరించాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా భూములకు భూధార్ నెంబర్ల కేటాయింపునకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల్లో వారసత్వ, ఇతర మ్యుటేషన్లకు సంబంధించి స్వీకరించిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. లైసెన్డ్ సర్వేయర్లు సర్వే చేసిన అనంతరం రెగ్యులర్ సర్వేయర్లు వాటిని స్క్రూటినీ చేసేలా చూడాలని ఆదేశించారు. కోర్ అర్బన్ ఏరియాలో నూతనంగా నిర్మించనున్న 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నమూనాలను సీఎం పరిశీలించారు. ప్రతి కార్యాలయంలో పార్కింగ్, క్యాంటీన్, ఇతర మౌలిక వసతులు ఉండాలని.. కార్యాయాలూ పూర్తిగా ప్రజలకు స్నేహపూర్వక వాతావరణంలో సౌకర్యవంతంగా ఉండేలా చూడాలని సీఎం సూచించారు.
Also Read: Hyderabad Rains: 24/7 సేవల్లో హైడ్రా.. విధుల్లో 3565 మంది, అణుక్షణం అప్రమత్తం!
నేటి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శులు వి.శేషాద్రి, కె.ఎస్.శ్రీనివాసరాజు, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, సీసీఎల్ఏ కార్యదర్శి డిఎస్ లోకేశ్ కుమార్, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతు, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి విపి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.