డ్రగ్స్ వాడేవాళ్లకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం డ్రగ్స్ వాడకం అనేది ఇంటింటి సమస్యగా మారిందని.. ఇకపై డ్రగ్స్ వాడేవాళ్లను కఠినంగా శిక్షిస్తామని వ్యాఖ్యానించారు. డ్రగ్స్ వాడుతూ సినిమా వాళ్లు పట్టుబడినా మినహాయింపు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఇకపై సినీ ప్రముఖులు డ్రగ్స్ వాడుతూ పట్టుబడితే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. డ్రగ్స్ తీసుకునే వారిని అరెస్ట్ చేయకపోతే దీన్ని కట్టడి చేయలేమని సీపీ అభిప్రాయపడ్డారు.
Read Also: తెలంగాణలో మరో భారీ స్కాం.. రూ.4 కోట్ల నిధులు మాయం
తాజాగా డ్రగ్స్ వాడుతూ పట్టుబడిన 9 మందిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారితో పాటు డ్రగ్స్ తీసుకుంటున్న మరో 13 మందిని గుర్తించారు. నిరంజన్ కుమార్ జైన్ అనే కాంట్రాక్టర్ దాదాపు 30 సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు పోలీసులు తేల్చారు. నిందితులను శాశ్వత్ జైన్, యగ్యానంద్, సూర్య సుమంత్ రెడ్డి, బండి భార్గవ్, వెంకట్ చలసాని, తమ్మినేని సాగర్, అల్గాని శ్రీకాంత్, బాడి సుబ్బారావులుగా గుర్తించారు. అందులో చాలా మంది ఆర్థికంగా బాగా సెటిలైన వారేనని పోలీసులు చెబుతున్నారు. ఇద్దరు వ్యాపారవేత్తలు ఆఫీస్ బాయ్స్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకుంటున్నారని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. నగరంలో డ్రగ్స్ తీసుకునే వారి చిట్టా తమ వద్ద ఉందని.. వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.