రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నుంచి శ్రీ క్రోధి నామ తెలుగు సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని, ప్రజల ఆశలు ఆకాంక్షలన్నీ నెరవేరాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో కాలం కలిసి రావాలని, సమృద్ధిగా వానలు కురిసి, రైతుల రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని ముఖ్యమంత్రి అభిలషించారు. నూతన సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించి, దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మన సంస్కృతి సంప్రదాయాలు చాటిచెప్పేలా ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.
ఇదిలా ఉంటే.. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి క్రోధినామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పండుగ ప్రజలందరికీ సకల శుభాలను పంచాలన్నారు. ప్రజల జీవితాల్లో సుఖ శాంతులు తేవాలని, కష్టాలు, నష్టాలు తొలగి ఆనందమయ జీవితాలకు ఈ పండుగ నాంధి కావాలని ఆకాంక్షించారు. ‘షడ్రుచుల సమ్మేళనంతో ప్రారంభమయ్యే ఉగాది.. తెలుగు లోగిళ్లలో నూతన సంవత్సర శోభను తెస్తూ, కొత్త లక్ష్యాలకు, కొత్త ఆలోచనలకు, ప్రతి ఒక్కరి ఉజ్వల భవిష్యత్తుకు, తద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడాలన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీల వల్ల లబ్ధి పొందుతున్న ప్రజల జీవితాల్లో ఆనందాలు నిండాలన్నారు. ఈ క్రోధి నామ సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలి’ అని అభిలాషించారు. ఈ క్రోధినామ సంవత్సరంలో సమృద్ధిగా వర్షాలు కురువాలని, పంటలు బాగా పండాలని, రైతులు బాగుండాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసినందున నిరుద్యోగులకు ఈ ఏడాది ఉద్యోగ నామ సంవత్సరం కావాలన్నారు.