ముస్లిం వాషర్లకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రయోజనాన్ని వర్తింపజేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆదేశించారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. ముస్లిం ధోబి ఘాట్లకు, లాండ్రీ షాపులకు 250 యూనిట్ల ఉచిత పథకాన్ని వర్తింప చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ నిర్ణయంతో తరతరాలుగా దోభి వృత్తిపై ఆధారపడి బతుకుతున్న రజకులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారని ఆయన మండిపడ్డారు. ఇక గల్లీ గల్లీలో వేరే వర్గానికి చెందిన వాళ్ళ లాండ్రీ షాపులు వెలుస్తాయని, ఓవైసీని సంతోష పెట్టడానికి రజకుల వృత్తిని నాశనం చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఈ నయా నిజాంకు మత పిచ్చి ఎక్కువైందంటూ బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఒక మతం ఓట్ల కోసం కేసీఆర్ హిందూ సమాజంలో ఉన్న కులవృత్తులను అణిచివేస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ది మత దురహంకారమని ఆయన విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా.. బీసీల కుల వృత్తులను ఆర్థికంగా దెబ్బతీసి అయినా సరే ఎంఐఎంను సంతృప్తి పరచాలన్నది కేసీఆర్ లక్ష్యమని బండి సంజయ్ విమర్శించారు.
Also Read : Pigeon: పావురాలు ఈ కలర్ లో కూడా ఉంటాయా? చూస్తే షాక్ అవ్వాల్సిందే
ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది మైనార్టీ వర్గం ఓట్ల కోసం కేసీఆర్ బీసీ ల కులవృత్తులపై దాడి చేస్తారా అని ఆయన అన్నారు. ఇప్పటికే వేరే వాళ్లు దూరడంతో తమ కులవృత్తుల వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని బీసీ కులాల వాళ్ళు తీవ్ర మనో వేదనలో ఉన్నారని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మూలిగే నక్కపై తాటి పండు ఎత్తేసినట్టుగా ఉందని ఆయన అన్నారు. కులవృత్తులపై ఆధారపడ్డ బీసీలు, ఎస్సీలు కేసీఆర్ చేస్తున్న ద్రోహన్ని గమనిస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఉన్న రజకులకు బిజెపి అండగా ఉంటుంది. సమిష్టిగా కేసీఆర్ మత దురహంకారం పై పోరాడుదాం. కులవృత్తులను కాపాడుకుందామన్నారు బండి సంజయ్
Also Read : Women Reservation Bill: “మీరు ఎంపీలను చంపడానికి ప్రయత్నించారు”.. సోనియాగాంధీపై బీజేపీ ఎంపీ ఆరోపణలు..