ఏపీ ప్రభుత్వం తీరుపై తీవ్రంగా మండిపడ్డారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. జగన్ పాలనలో ఆక్వా రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. ఆక్వా విద్యుత్ రాయితీలను తక్షణమే పునరుద్ధరించి ఛార్జీల భారాన్ని తగ్గించాలి. విద్యుత్ ఛార్జీల పెంచి ఆక్వా రంగాన్ని పట్టపగలు ఉరితీశారు. అత్యధిక ఆదాయాన్ని, ఉపాధి కల్పించే ఆక్వారంగంపై జగన్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందన్నారు అచ్చెన్నాయుడు.
తెలుగుదేశం హయాంలో తగ్గించిన ఆక్వా విద్యుత్ ఛార్జీలను ఇప్పుడు రెట్టింపు చేశారు. ఇప్పటికే విద్యుత్ కోతలు, పవర్ హాలిడేల నిర్ణయంతో ప్రాసెసింగ్ కంపెనీలు రొయ్యల ధరలు తగ్గించాయి. జగన్ రెడ్డి రాయితీలు ఎత్తేస్తూ తీసుకున్న అసమర్థ నిర్ణయంతో ఆక్వా రైతులు అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం వుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్వా రైతులకు మేలు చేయకపోగా.. వారిపై ఛార్జీల భారం మోపారని విమర్శించారు.
Also Read:LIVE: ఏపీఎస్ఆర్టీసీ ఛార్జీల పెంపు
పాదయాత్ర సమయంలో ఆక్వా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారు. జగన్ జారీ చేసిన జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. లేదంటే టీడీపీ ఆధ్వర్యంలో నిరసనలకు దిగుతామని హెచ్చరించారు.