AP Assembly: అమరావతిలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ ద్రవ్య వినిమయ బిల్లు–2026ను సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు సమయంలో వ్యాట్ సవరణ బిల్లును కూడా మంత్రి సభలో ప్రవేశపెట్టగా, ఆ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసినప్పుడు రాష్ట్రంలో కోర్టుల్లో లక్షల సంఖ్యలో కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారన్నారు. కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ కోర్టుల మౌలిక సదుపాయాలు తగిన స్థాయిలో లేకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. కేసుల సంఖ్యను తగ్గించే దిశగా రాజకీయ నాయకులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని గవర్నర్ ప్రశ్నించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్లో 100 కోర్టు భవనాల నిర్మాణానికి రూ.349 కోట్లు కేటాయించడం అభినందనీయమని అన్నారు. ఒక కేసు ఒక వ్యక్తిపై ఉన్నా అది ఆ కుటుంబ సభ్యులపై, సమాజంపై కూడా ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. కేసుల పరిష్కారానికి సరైన మార్గాలు అన్వేషించాలని గవర్నర్ సూచించారని తెలిపారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో గవర్నర్ సూచనలను అమలు చేస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అలాగే రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సభలో 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నప్పటికీ.. 1100 మంది ఉన్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. వారు చెప్పిన విషయాలను చాలా బలంగా నమ్ముతారని అన్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.
రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన ఆర్టికల్ 21ను వైసీపీ సభ్యులు సరైన విధంగా అర్థం చేసుకోవడం లేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అలాగే ఆర్టికల్ 19(1)(a) ప్రకారం మాట్లాడే స్వేచ్ఛను ఇతరులను దూషించేందుకు ఉపయోగిస్తున్నారని విమర్శించారు. విభిన్న కులాల నుంచి వచ్చిన ప్రజలు ఐక్యంగా ఉంటేనే ఇలాంటి ఆలోచనలను మార్చగలమని అన్నారు.
Gautam Gambhir: గంభీర్ వ్యూహం సూపర్ హిట్.. సెమీస్లో భారత్ విజయం వెనుక అసలు కథ ఇదే!
వైసీపీ నాయకులు తమ తప్పులను దాచిపెట్టి ఇతరులపై ఆరోపణలు చేస్తారని, కులాల వెనుక దాక్కోవడం సరైన పద్ధతి కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇలాంటి ధోరణి కొనసాగితే ప్రజలకే నష్టం జరుగుతుందని హెచ్చరించారు. ప్రజలకు నిజాలను ఎలా చెప్పాలో అలా చెప్పాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వం ఎంత మంచి బడ్జెట్లు పెట్టినా ప్రజలకు అవి సరిగ్గా చేరేలా పనిచేయాలని ఆయన పేర్కొన్నారు.