ప్రధాని నరేంద్ర మోడీ-కేంద్ర హోంశాఖ అమిత్షా ద్వయానికి గుజరాత్ రాజకీయాల నుంచి కేంద్ర రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వంలోనూ ప్రత్యేక స్థానం ఉంది.. ఆ ఇద్దరు కలిసి ఎన్నో విజయాలను అందుకున్నారు.. మోడీ ముఖ్యమంత్రిగా, ప్రధానిగా కలిపి 20 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఓ టీవీ చానెల్తో ప్రత్యేంగా మాట్లాడిన అమిత్ షా.. ప్రధాని మోడీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను బటయపెట్టారు.. మోడీ నియంత కాదని, తనకు తెలిసిన అత్యంత ప్రజాస్వామిక నేతల్లో ఒకరని పేర్కొన్న ఆయన.. మోడీ నియంత అంటూ విపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని కొట్టిపారేశారు. సుదీర్ఘ కాలంగా మోడీతో కలిసి పనిచేస్తున్నాను.. ఏదైనా అంశంపై సమావేశం జరిగితే ఆయన చాలా తక్కువగా మాట్లాడతారని.. ముందుగా ఇతరులు చెప్పేది పూర్తిగా వింటారని తెలిపారు షా.
ఇక, వ్యక్తి హోదాతో సంబంధం లేకుండా ప్రధాని మోడీ సలహాలు, సూచనలు స్వీకరిస్తారని.. వారి అభిప్రాయాలు తెలుసుకుంటారని తెలిపారు అమిత్షా… మంచి, చెడ్డలను పూర్తిగా బేరీజు వేసుకున్న తర్వాతే మోడీ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.. అలాంటి శ్రోతను నేనెక్కడా చూడలేదంటూ మోడీపై ప్రశంసలు కురిపించిన అమిత్షా… ఆయనను నియంత అనడం సరికాదు.. అలా అంటున్న వారి మాటల్లో నిజం లేదన్నారు.. మరోవైపు.. నిరక్షరాస్యులు దేశానికి భారమని, వారెప్పుడూ మంచి పౌరులు కాలేరని వ్యాఖ్యానించారు అమిత్ షా. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు, విధుల గురించి వారికి తెలియదని, అటువంటప్పుడు వారెలా మంచి పౌరులు కాగలరంటూ ప్రశ్నించారు. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ.. గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో నిరక్షరాస్యత సమస్యను పరిష్కరించారని గుర్తుచేశారు. ప్రాథమిక పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ వంద శాతం జరగడం గుజరాత్ సీఎంగా మోడీ సాధించిన ఘనతల్లో ఒకటని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా.