Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’తో భారత్ పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థల స్థావరాలే లక్ష్యంగా భారీ ఎత్తున దాడులు చేసింది. భారత త్రివిధ దళాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. పాకిస్తాన్ భూభాగంతో పాటు పీఓకేలోని 09 చోట్ల భారత్ విధ్వంసం సృష్టించింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్కి చెందిన ఉగ్రవాదులు 100 మంది వరకు హతమయ్యారని తెలుస్తోంది.
అయితే, తాము పాక్ మిలిటరీ ఆస్తులపై, పౌరులపై ఎలాంటి దాడులు చేయలేదని, కేవలం ఉగ్రవాదులు, వారి స్థావరాలను నాశనం చేసినట్లు భారత్ ప్రకటించింది. ఇదే విషయాన్ని ప్రపంచ దేశాలకు చెప్పింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ యూకే, యూఎస్, ఫ్రాన్స్, చైనా, సౌదీ అరేబియా, జపాన్ దేశాల అధికారులతో మాట్లాడారు. ప్రపంచ సూపర్ పవర్స్తో పాటు కీలక దేశాలు అన్ని భారత్కి అండగా నిలుస్తున్నాయి.
Read Also: Asaduddin Owaisi: వైమానిక దాడిలో ఉగ్రవాదుల హతం… అసదుద్దీన్ ఒవైసీ వీడియో వైరల్!
ఇదిలా ఉంటే, పాకిస్తాన్కి అంతర్జాతీయంగా ఏకాకిగా మారినప్పటికీ కేవలం రెండు దేశాలు మాత్రమే పాక్ వైపు నిలుపుచున్నాయి. భారత్ దాడిని ఖండిస్తూ, పాకిస్తాన్కి టర్కీ, అజర్ బైజాన మద్దతు ప్రకటించాయి. టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎక్స్లో ‘‘ పాకిస్తాన్, భారతదేశం మధ్య జరుగుతున్న పరిణామాలను మేము ఆందోళనతో గమనిస్తున్నాము. భారతదేశం నిన్న (మే 6) రాత్రి జరిపిన దాడి పూర్తి స్థాయి యుద్ధ ప్రమాదాన్ని పెంచుతుంది. పౌరులు, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులతో పాటు ఇటువంటి రెచ్చగొట్టే చర్యలను మేము ఖండిస్తున్నాము’’ అని పోస్ట్ చేసింది.
ఇక పాకిస్తాన్కి అజర్ బైజాన్ కూడా మద్దతు ప్రకటించింది. హింసను ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరగడంపై అజర్ బైజాన్ ఆందోళన వ్యక్తి చేస్తోంది. పాకిస్తాన్ పై జరిగిన సైనిక దాడులను మేము ఖండిస్తున్నాము, ఇందులో అనేక మంది పౌరులు మరణించారు, గాయపడ్డారు. పాకిస్తాన్ ప్రజలకు సంఘీభావంగా, అమాయక బాధితుల కుటుంబాలకు మేము సంతాపం తెలియజేస్తున్నాము, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము’’ అని ప్రకటనలో పేర్కొంది.