భారత ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ రానున్నారు.. హైదరాబాద్ వేదికగా జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనబోతున్నారు.. ఇక, 3వ తేదీన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు మోడీ.. ఇప్పటికే మోడీకి వ్యతిరేకంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో వెలిసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్లు కలకలం సృష్టించగా.. అప్రమత్తమైన అధికారులు వెంటనే వాటిని తొలగించారు.. మరోవైపు.. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు తెలంగాణ పోలీసులు.. ఐదువేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనలో ఉన్నంతసేపు మూడంచెల భద్రత కొనసాగించనున్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్, హెచ్ఐసీసీ, రాజ్ భవన్ చుట్టూ కేంద్ర బలగాలు మోహరించారు..
Read Also: Bye bye Modi: పీఎంకు వ్యతిరేకంగా హైదరాబాద్లో ఫ్లెక్సీలు.. ‘సాలు మోడీ సంపకు మోడీ’
అయితే, తన హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోడీ రాజ్భవన్లో బస చేస్తారని తెలుస్తున్నా.. దానిపై ఎస్పీజీ నిర్ణయం తీసుకోనుంది.. కానీ, రాజ్భవన్లో బస చేస్తే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయంటున్నారు తెలంగాణ పోలీసులు.. దీంతో, రాజ్భవన్ కాకుండా.. ఏదైనా హోటల్లో ప్రధాని నరేంద్ర మోడీ బస చేస్తారని కూడా ప్రచారం సాగుతోంది.. మరోవైపు జెడ్ ప్లస్ క్యాటగిరి ఉన్న హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేస్తున్నారు.. ఇప్పటికే నోవాటెల్ను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు, విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మొత్తంగా హైదరాబాద్ను పెద్ద స్థాయిలో వీఐపీలు రానున్నారు.. తదనుగునంగా భద్రతా చర్యలు చేపడుతున్నారు పోలీసులు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన ఆందోళన విధ్వంసానికి దారితీసిన నేపథ్యంలో పోలీసులు సెక్యూరిటీని పెంచారు. తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన భారతీయ జనతా పార్టీ.. వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే అనే ధీమా వ్యక్తం చేస్తుంది.. అందులో భాగంగానే హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే.