మొబైల్ వినియోగదారులకు మరో షాక్ తగిలింది. ప్రముఖ టెలికాం కంపెనీ జియో కూడా చార్జీలను అమాంతంగా పెంచింది. 20 శాతం మేర ఛార్జీలను పెంచుతున్నట్టు ఆదివారం ప్రకటించింది. పెంచిన చార్జీలు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఇటీవల ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా ఛార్జీలు పెంచిన సంగతి తెల్సిందే. ఇప్పుడు అదే బాటలో జియో కూడా నడుస్తుంది. టెలికాం పరిశ్రమను బలోపేతం చేయడానికే ఛార్జీలను పెంచుతున్నట్టు జియో ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ మేరకు సవరించిన అన్ని ఫ్లాన్ల ధరల వివరాలను వెల్లడించింది. జియో ఫోన్ కోసం అందుబాటులో ఉన్న ప్రాథమిక ప్లాన్కు రూ.75 బదులు ఇకనుంచి రూ.91 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రూ. 199 ప్లాన్ (28 రోజులకు 1.5జీబీ/రోజుకు) ధరను రూ.239కి పెంచింది. రూ.444 ప్లాన్కు రూ.533, రూ.555 ప్లాన్కు రూ.666 చొప్పున ఇక పైనుంచి చెల్లించాల్సి ఉంటుంది.