Eknath Shinde: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రధాని నరేంద్రమోడీ తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటారని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే అన్నారు. ఇండియా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు బలమైన దౌత్య నిర్ణయాలు తీసుకుంది. దేశ ప్రజలు ప్రస్తుతం సైనిక ప్రతిస్పందన ఆశిస్తున్నారు. “ఇది చివరి దాడి అవుతుందని మన ప్రజలు నమ్ముతున్నారు. ప్రధాని మోడీ పాకిస్తాన్ను తుడిచిపెడతారు” అని షిండే చెప్పారు.
Read Also: Vaibhav Suryavanshi: ఆర్ఆర్ యాజమాన్యానికి తలనొప్పిగా మారిన వైభవ్ సూర్యవంశీ..
గత వారం జమ్మూకాశ్మీర్ పహల్గామ్లో పాకిస్తాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు టూరిస్టులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 26 మంది చనిపోయారు. దీంతో ఒక్కసారిగా ఈ ఘటనపై దేశవ్యాప్తంగా భావోద్వేగాలు ఎగిసిపడ్డాయి. పాకిస్తాన్పై తప్పకుండా ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతీ భారతీయుడు కోరుకుంటున్నారు. భారత్ ఇప్పటికే దౌత్యపరమైన చర్యలు తీసుకుంది. ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేసుకోవడంతో పాటు పాక్ జాతీయులకు వీసాలు రద్దు చేసింది. పాక్ విమానాలకు భారత గగనతలాన్ని మూసేసింది. ప్రధాని మోడీ త్రివిధ దళాలు, కీలక మంత్రులతో వరస సమావేశాలు నిర్వహించారు.
దీనిపై ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ..‘‘ప్రధాని మోదీ భారత సైన్యం, భారత నావికాదళం మరియు భారత వైమానిక దళం ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు…. గతంలో చాలా దాడులు జరిగాయి, కానీ అప్పటి ప్రభుత్వాలు తగిన సమాధానం ఇవ్వలేదు. కానీ ప్రధాని మోదీ పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకున్నారు, సర్జికల్ స్ట్రైక్ కూడా చేశారు’’ అని అన్నారు.