Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- మహారాష్ట్రలో ఆర్టీఐలో మార్పులు
- అన్నాహజారే తీవ్ర అభ్యంతరం
- హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో కొత్తగా తీసుకొచ్చిన రైట్ టు ఇన్ఫర్మేషన్ (RTI) రూల్స్-2026 అమలును రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే నిరవధిక నిరాహార దీక్షకు సిద్ధమవడంతో పాటు కొత్త నిబంధనలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
అధికార వర్గాల సమాచారం ప్రకారం.. కొత్త నిబంధనల అమలును తాత్కాలికంగా నిలిపివేయాలని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్కు ఫడ్నవీస్ ఆదేశాలు జారీ చేశారు. అన్నా హజారేతో చర్చలు జరపకుండా సవరించిన నిబంధనలపై తుది నిర్ణయం తీసుకోవడం సరైనది కాదని ముఖ్యమంత్రి లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో మహారాష్ట్ర రాష్ట్ర సమాచార కమిషన్ వెంటనే కొత్త నిబంధనల అమలును నిలిపివేసింది.
Also Read
- NEET PG 2026 Exam: నేడే నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష.. అభ్యర్థులు ఈ తప్పులు చేయకండి.. కీలక మార్గదర్శకాలు
- Mohan Bhagwat: ‘భారత్లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
ఇదిలా ఉండగా ఇటీవల రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ రాహుల్ పాండే.. అహ్మద్నగర్ జిల్లాలోని రాలేగణ్ సిద్ధిలో అన్నా హజారేతో భేటీ అయ్యారు. అయితే కొత్త నిబంధనలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని అన్నా హజారే తన డిమాండ్పై వెనక్కి తగ్గలేదు. కొత్త ఆర్టీఐ నిబంధనలు సమాచార హక్కు చట్టం అసలు ఉద్దేశాన్నే బలహీనపరుస్తున్నాయని, ప్రజలకు సమాచారం పొందడాన్ని మరింత క్లిష్టతరం చేస్తున్నాయని అన్నా హజారే ఆరోపించారు. నిబంధనలు ఉపసంహరించకపోతే జూలై 5 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించారు.
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు పంపిన వినతిపత్రంలో కొత్త నిబంధనల వల్ల సమాచారం కోరే వారికి అదనపు విధానపరమైన అడ్డంకులు, ఆర్థిక భారం పెరుగుతుందని, అప్పీల్ ప్రక్రియ కూడా క్లిష్టమవుతుందని హజారే పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రజలతో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే ఈ నిబంధనలను తీసుకొచ్చారని విమర్శించారు. ఆర్టీఐ నిపుణులు, సమాచార కమిషనర్లు, సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు, జర్నలిస్టులు, ప్రజలతో చర్చించిన తర్వాతే కొత్త నిబంధనలు రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
కొత్త ఆర్టీఐ నిబంధనల్లో ఏమున్నాయి?
జూన్ 12న గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించిన మహారాష్ట్ర ఆర్టీఐ రూల్స్-2026 వెంటనే అమల్లోకి వచ్చాయి. కొత్త నిబంధనల ప్రకారం ఆర్టీఐ దరఖాస్తు ఫీజును రూ.30కు పెంచారు. ఏ4 సైజు పేజీకి రూ.5, స్కాన్ లేదా డిజిటల్ పేజీకి కూడా రూ.5 వసూలు చేయనున్నారు.
ప్రభుత్వ రికార్డులను పరిశీలించేందుకు మొదటి గంట ఉచితం కాగా.. ఆ తర్వాత ప్రతి అదనపు గంటకు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. బీపీఎల్ (పేదరిక రేఖకు దిగువన ఉన్నవారు) దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు పొందినా.. 50 పేజీలకు మించి సమాచారం కోరితే ఛార్జీలు వర్తిస్తాయి.
కొత్త నిబంధనల ప్రకారం ఒక ఆర్టీఐ దరఖాస్తులో సాధారణంగా ఒకే అంశం ఉండాలని, అది 150 పదాల లోపే ఉండాలని పేర్కొన్నారు. ఒకటి కంటే ఎక్కువ అంశాలు ఉంటే మొదటి అంశాన్నే పరిగణనలోకి తీసుకుని మిగిలిన వాటికి వేరువేరు దరఖాస్తులు చేయాలని ప్రజా సమాచార అధికారి (PIO) సూచించవచ్చు.
దరఖాస్తుతో పాటు భారత పౌరసత్వాన్ని నిరూపించే స్వీయ ధృవీకరించిన ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా జత చేయాలి. అది లేకపోతే దరఖాస్తును తిరిగి పంపే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వ వెబ్సైట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న సమాచారాన్ని మళ్లీ కాపీల రూపంలో ఇవ్వకుండా.. ఆన్లైన్లోనే చూడాలని సూచించే అధికారం కూడా పీఐఓకు కల్పించారు. అలాగే ప్రజా ప్రయోజనానికి సంబంధం లేని వ్యక్తిగత సమాచారాన్ని సాధారణంగా వెల్లడించబోమని నిబంధనల్లో స్పష్టం చేశారు.
అదేవిధంగా మొదటి అప్పీల్కు రూ.50, రెండో అప్పీల్కు రూ.100 ఫీజు నిర్ణయించారు. విచారణలను ప్రత్యక్షంగా లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించేందుకు కూడా అవకాశం కల్పించారు. ప్రజా సంస్థలు ఆర్టీఐ చట్టంలోని సెక్షన్-4 ప్రకారం స్వచ్ఛంద సమాచార వెల్లడిని తప్పనిసరిగా అమలు చేయాలని, నిర్లక్ష్యం చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కొత్త నిబంధనల్లో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
NEET PG 2026 Exam: నేడే నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష.. అభ్యర్థులు ఈ తప్పులు చేయకండి.. కీలక మార్గదర్శకాలు
-
Mohan Bhagwat: ‘భారత్లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
-
Bank Locker Swept: వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు లాకర్.. రూ. లక్షల్లో డబ్బు.. ఎగబడిన జనం
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
NBK111 vs King100: బాలయ్య vs నాగ్.. క్రిస్మస్ బాక్సాఫీస్పై మరో బిగ్ క్లాష్!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!